ఖజానా నింపేందుకు జగన్ రూటే సెపరేటు

తాను ప్రకటించిన ప్రకారం సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళుతున్నారు ఏపీ సీఎం జగన్. నవ రత్నాల పేరుతో పలు ప్రజాకర్షక పథకాలను దశలవారీగా అమలు చేస్తూ…అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే, జగన్ ఏడాది పాలన పూర్తయిన వెంటనే కరోనా రూపంలో వచ్చిన పెను విపత్తు వల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడింది. అయినప్పటికీ సంక్షేమ పథకాల అమలులో…మాత్రం జగన్ వెనుకడగుడు వేయడం లేదు.

ప్రభుత్వాన్ని నడిపేందుకు, సంక్షేమ పథకాల అమలుకు జగన్ ప్రత్యామ్నాయాలు వెతికారు. ఖజానా నింపుకునేందుకు జగన్…ధరలు ఎక్కడ పెంచినా ప్రజలు పెద్దగా పట్టించుకోని అంశాలను ఎంచుకున్నారు. మద్యం ధరలను 75 శాతం పెంచి వైన్ షాపుల సంఖ్య తగ్గించినా…ప్రజలు పెద్దగా ప్రశ్నించే అవకాశం లేదు.

ఇక, కొన్నాళ్ల క్రితం పెట్రో, డీజిల్ ధరలు పెంచి మరో తరహాలో ఖజానా నింపుకుంటున్నారు. తాజాగా, రిజిస్ట్రేషన్ ధరలను ఏకంగా 49 శాతం పెంచి ఖజానాను నింపుకునేందుకు జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ప్రతి రెండు సంవత్సరాలకు గ్రామీణ ప్రాంతాలు, ఏడాదికోసారి పట్టణ ప్రాంతాల్లో భూముల విలువలును సవరిస్తుంటారు. సాధారణంగా అయితే 5 శాతం మాత్రమే పెంచుతుంటారు. గత ఏడాది మాత్రం..కొన్ని చోట్ల 5 శాతం, మరికొన్ని ప్రాంతాల్లో 10 శాతం చొప్పున భూముల విలువలు పెరిగాయి. వాటికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగాయి.

అయితే, ఈ ఏడాది భూముల రిజిస్ట్రేషన్ ధరలు ఏకంగా 49 శాతం వరకు పెంచేందుకు జగన్ సర్కార్ యోచిస్తోందని తెలుస్తోంది. ఆగస్టు 1 నుంచి రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలు పెంచిన ధరలను అమల్లోకి తెచ్చేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశాయని తెలుస్తోంది. భూములకు డిమాండ్‌ ఎక్కడ ఉందో అక్కడే రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెంచే ప్రతిపాదనలు తయారయ్యాయని తెలుస్తోంది.

ఈ రకంగా జగన్ ధరలు పెంచినా ప్రజలు పెద్దగా పట్టించుకోని రంగాలను ఎంచుకొని…వ్యూహాత్మకంగా ఆదాయం పెంచుకుంటున్నారు. కట్టె విరగకుండా….పాము చావకుండా ఖజానాను నింపుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ తరహాలోనే మరి కొన్ని అంశాల్లో ధరలు పెంచేందుకు కూడా జగన్ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఖజానా నింపేందుకు జగన్ సైలెంట్ బాదుడు కార్యక్రమాలు మరిన్ని చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.