బలం ఉంది కానీ బలమైన అభ్యర్థులే లేరు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర సమితి(ప్రస్తుత బీఆర్ఎస్)కు ఉన్న ఎమ్మెల్యేలు 10 మంది. అది కూడా ఉత్తర తెలంగాణలో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఆదిలాబాద్‌లో ముగ్గురు, నిజామాబాద్‌లో ఒక్కరు, కరీంనగర్‌లో నలుగురు, వరంగల్, మెదక్‌లో ఒక్కొక్కరు గెలిచారు. ఆ ఎన్నికలలో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 3.99.

కానీ, 2014లో రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా 2019లోనూ అధికారం సాధించింది.


ఇప్పుడు బీజేపీ కూడా ఈ లెక్కలనే నమ్ముతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో తమ బలం తక్కువే అయినా 2023 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడం సాధ్యమేనని వారు నమ్ముతున్నారు. 2014లో తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచినట్లు… 2018లో త్రిపురలో తాము గెలిచినట్లు 2023లో తాము గెలుస్తామని బీజేపీ నేతలు అంటున్నారు.

తాజాగా తెలంగాణకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పార్టీ నేతలకు విజయకాంక్షనే రగిలించి వెళ్లారు. 2023లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి వెళ్లారు. దీనికోసం ఆయన వారి చెవిలో విజయ సూత్రం చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో అసంతృప్త నేతలను పార్టీలోకి తీసుకోవాలని.. 119 నియోజకవర్గాలకూ అభ్యర్థులను సిద్ధం చేసుకోవాలని చెప్పారు.

తెలంగాణ బీజేపీకి ఇప్పుడు ఇదే సమస్యగా మారింది. మునుగోడు ఎన్నికల వరకు బీజేపీ అంటే ఇతర పార్టీల నేతల్లో కొందరికి భయం, మరికొందరికి మోజు ఉన్నప్పటికీ ఈ ఎన్నికల ఫలితాల తరువాత ఆ రెండూ పోయాయి. మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడంతో బీజేపేది వాపేనా బలం కాదా అనే అనుమానం ఒకటి మొదలైంది. దాంతో చేరికలు తగ్గాయి. ఇప్పుడు బీజేపీని ఆందోళన కలిగిస్తోంది అదే.

పార్టీ ప్రధాన నేతలు కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను ఎంతలా ఎదుర్కొన్నా నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోతే చేసేదేం లేదన్నది వారి ఆందోళన.


2014లో కొత్త రాష్ట్రం ఏర్పడడంతో అప్పటికి టీఆర్ఎస్‌కు అభ్యర్థులు చాలామంది కొత్తవారైనా కూడా సెంటిమెంట్ కలిసొచ్చింది. కానీ… ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవు. ఉన్నదల్లా బీజేపీపై ప్రజల్లో కొంత ఆసక్తి, బీఆర్ఎస్‌పై ప్రభుత్వ వ్యతిరేకత… దీన్ని బీజేపీ కరెక్టుగా వాడుకోవాలంటే నియోజకవర్గాలలో ఓట్లు రాబట్టగలిగే అభ్యర్థులు కావాలి. బీజేపీ ముందున్న ప్రధానమైన సవాల్ ఇదే.