జ‌గ‌న్‌ను దుమ్ము దులిపేసిన చంద్ర‌బాబు..!

ఏపీ సీఎం జ‌గ‌న్‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు దుమ్ము దులిపేశారు. మాజీ మంత్రి జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య జ‌రిగి నాలుఏళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన ఆయ‌న జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. “జస్టిస్ ఫర్ వివేకా” అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. వివేకా హత్య జగనాసుర రక్త చరిత్ర అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసని నిప్పులు చెరిగారు.

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క పనీ చేయలేక పోయారని… చివరకు సొంత బాబాయ్ హత్య కేసులో నిజమైన నిందితులను శిక్షించడంతో సహా అంటూ ఎద్దేవా చేశారు. వివేకా హత్య జగనాసుర రక్త చరిత్రే అని పులివెందుల పూల అంగళ్ల సెంటర్ నుంచి రాష్ట్రంలో ప్రతి ఇంటా తెలుసని… అది ఆ ఇంట జరిగిన కుట్రే అని అన్నారు.

“తండ్రి శవం పక్కన ఉండగానే పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి… బాబాయ్ హత్యతో రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి…. ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా?” అంటూ వివేకా హత్య పరిణామాలపై చంద్రబాబు ట్వీట్ చేశారు. తాజాగా వివేకా కుమార్తె సునీత త‌న కుటుంబ‌స‌భ్యులే త‌న‌కు న్యాయం చేయ‌డం లేదంటూ.. మీడియా ముందు వాపోయారు. త‌న‌కు కుటుంబ స‌భ్యులంటే ఎంతో ప్రేమ ఉంద‌ని.. కానీ.. వారి వ‌ల్ల త‌న ప్రాణ‌మైన తండ్రిని పోగొట్టుకున్నాన‌ని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ‌డం గ‌మ‌నార్హం.