భాస్క‌ర‌రెడ్డి వచ్చారు.. సీబీఐ రాలేదు

ఏపీ స‌హా దేశంలో సైతం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఆదివారం క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్క‌ర‌రెడ్డిని సీబీఐ విచారించాల్సి ఉంది. ఈ కేసులో తీవ్ర దూకు డు ప్ర‌ద‌ర్శిస్తున్న సీబీఐ.. అవినాష్‌తో పాటు ఆయ‌న తండ్రిని కూడా అరెస్టు చేస్తామ‌ని.. ఇటీవ‌ల తెలంగాణ కోర్టుకు తెలిపింది. ఈ నేప‌థ్యంలో తాజాగా భాస్క‌ర‌రెడ్డి విచార‌ణ అంశం.. ప‌తాక స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఏం జ‌రుగుతుంద‌నే ఉత్కంఠ కూడా రేపింది.

అయితే.. అనూహ్యంగా సీబీఐ ఈ విచార‌ణ‌ను వాయిదా వేసింది. భాస్కర్ రెడ్డిని ఏడాది కిందట వరసగా రెండు రోజుల పాటు పులివెందులలో సీబీఐ విచారించింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఆదివారం విచారణకు పిలిచారు. గత నెల 23నే విచారణకు రావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు అందించినా.. వ్యక్తిగత కారణాలతో గడువు కోరారు. ఈ నెల 5వ తేదీన మరోసారి నోటీసులు అందజేసిన సీబీఐ అధికారులు.. ఈ నెల 12న కడపలో విచారణకు రావాలని సీఆర్పీసీ 160 కింద నోటీసులిచ్చారు.

దీంతో భాస్కర్‌రెడ్డి కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ఈరోజు సీబీఐ విచారణకు హాజరయ్యారు. అక్కడ అధికారులెవరూ లేకపోవడంతో ఆయ‌న వెళ్లిపోయారు. అధికారులు మళ్లీ నోటీసులు ఇచ్చి పిలిస్తే.. వస్తానని భాస్కర్ రెడ్డి తెలిపారు. అంతేకాదు.. సీబీఐ అరెస్టు సహా ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని.. చెప్పారు. విచారణ కోసం కడప సెంట్రల్ జైలుకు వచ్చిన ఆయన.. అధికారులు లేకపోవడంతో వెనుదిరిగారు.

విచారణ తేదీ మళ్లీ చెబుతామన్నారని.. మరోసారి నోటీసు ఇస్తే సీబీఐ ముందుకు వస్తానని భాస్కర్‌రెడ్డి తెలిపారు. హత్యా స్థలంలో దొరికిన లేఖపై సీబీఐ ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. భాస్కరరెడ్డి వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా కడప సెంట్రల్ జైలు వద్దకు తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.