తెలంగాణలో మరో టీఆర్ఎస్?

రెండు దశాబ్దాలపాటు తెలంగాణ ప్రజల నోళ్లలో నానిన టీఆర్ఎస్ అనే మాట ఇప్పుడు వినిపించడం లేదు. టీఆర్ఎస్‌లోని తెలంగాణ పేరు పోయి భారత్ రావడంతో బీఆర్ఎస్‌గా మారి టీఆర్ఎస్‌ను తుడిచేసింది. కానీ, టీఆర్ఎస్‌ అనేది మళ్లీ ప్రజల నోట వినిపించేలా తెలంగాణకు చెందిన ఓ నేత ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయంగా బీఆర్ఎస్‌ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఎన్నికల్లో దెబ్బతీయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే.. బీఆర్ఎస్ వర్గాలు దీన్ని ఎలా అడ్డుకుంటాయనేది చూడాలి.

కొద్దిరోజులుగా బీఆర్ఎస్‌లో అసమ్మతి గళం వినిపిస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త పార్టీ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వినిపిస్తోంది. టీఆర్ఎస్ అని వచ్చే తెలంగాణ రైతు సమితి పేరుతో ఆయన పార్టీ పెట్టడానికి ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్‌కు, పొంగులేటికి మధ్య పూర్తిగా సంబంధాలు చెడడంతో ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం తొలుత జరిగింది. కానీ, ఆ దిశగా ఎలాంటి ముందడుగు కనిపించలేదు. మరోవైపు పొంగులేటి తమ పార్టీలో చేరుతారని షర్మిల, విజయమ్మ కూడా అన్నప్పటికీ పొంగులేటి దాన్ని ఖండించారు.

తాజాగా ఆయన ఏదో ఒక పార్టీలో చేరి తన గెలుపు వరకు చూసుకోవడం కాకుండా ఏకంగా కేసీఆర్‌కు పోటీ ఇవ్వాలని యోచిస్తున్నట్లు ఖమ్మం రాజకీయవర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో తనకు అనుకూలమైన నాయకులను సంప్రదిస్తున్నారని.. కొత్త పార్టీ పెట్టి రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇందుకోసం తెలంగాణ రైతు సమితి(టీఆర్ఎస్) పేరుతో పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్లాలని తలపోస్తున్నారట. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడంతో ఇప్పుడు తాను టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెడితే ఎన్నికల్లో ప్రజలను కన్ఫ్యూజ్ చేసి కేసీఆర్‌ను దెబ్బతీయొచ్చని పొంగులేటి భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. అయితే, ఇది ప్రాక్టికల్‌గా ఎంతవరకు సాధ్యమో చూడాలి.