అమరావతి కేసుల్లో జగన్ కు ఎదురుగాలి

ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ ప్రభుత్వం విశాఖలో పెట్టుబడుల సదస్సుకు ఏర్పాట్లు చేస్తోంది. శుక్ర, శనివారాల్లో నిర్వహించే సదస్సు కోసం విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిధులకు విశాఖ విశిష్టతను చెప్పడంతో పాటు, కాబోయే రాజధానిగా పరిచయం చేయాలని జగన్ అనుకుంటున్నారు. ఆ దిశగా కొంత సాహిత్యం కూడా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. విశాఖకున్న ప్రయోజనాలను వివరించేందుకు వీడియోలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అమరావతి కేవలం శాసన రాజధాని మాత్రమేనని అందరికీ తెలియజెప్పాలని జగన్ సంకల్పంగా కనిపిస్తోంది.

ససేమిరా అన్న సుప్రీం…

అమరావతి కేసుల్లో హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి ప్రతికూలంగా వచ్చింది. అమరావతి నుంచి రాజధానిని విశాఖకు మార్చేందుకు అనుమతి లభించలేదు. పైగా రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించే విషయంలోనూ కోర్టు టైమ్ ఫ్రేమ్ విధించింది. దానితో జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకెక్కింది. ఈ నెల 28న విచారణ ఉండగా, తక్షణమే విచారణ చేపట్టాలని అభ్యర్థించింది. విశాఖ పెట్టుబడుల సదస్సు జరుగుతుండగానే విచారణ జరిగితే చెప్పుకునేందుకు ఒక పాయింట్ దొరుకుతుందని ప్రభుత్వం ఎదురు చూసింది. అయితే ఈ నెల 28వ తేదీనే విచారిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ ధర్మాసనం తేల్చి చెప్పింది. 28వ తేదీకన్నా ముందే కేసు విచారణ జరపాలన్న ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదుల విజ్ణప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది.

రాజ్యాంగ పరమైన అంశాలు అమరావతి కేసులో చాలా ఇమిడి ఉన్నాయని న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ పేర్కొన్నారు. 28వ తేదీ ఒక్క రోజే విచారణ సరిపోదని… బుధ, గురువారాల్లో అంటే 29,30న కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. బుధ, గురువారాల్లో నోటీసులు ఇచ్చిన కేసుల్లో విచారణ జరపరాదని సిజెఐ సర్క్కులర్ ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. అయితే సిజెఐ ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదు కోరారు. సిజెఐ ముందు ప్రస్తావించడానికి తనకేమీ అభ్యంతరం లేదన్న న్యాయమూర్తి కె ఎం జోసెఫ్…కాకపోతే అందుకు తన అనుమతి అవసరం లేదన్నారు. తను రిటైర్ అయ్యే లోపు ఈ కేసు విచారణ పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు కూడా న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ తెలిపారు…

శుక్రవారం సిజెఐ ముందుకు..

అమరావతి కేసులో విచారణ తేదీలపై క్లారిటీ కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 28 మంగళవారంతో పాటు బుధ, గురు వారాల్లో కూడా విచారణ జరిగే విధంగా డెరెక్షన్ కోసం పిటిషన్ వేయబోతోంది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ధర్మాసనంలో శుక్రవారం ఒక పిటిషన్ వేస్తారు. మరి మూడు రోజుల విచారణకు ప్రధాన న్యాయమూర్తి అంగీకరిస్తారో లేదో చూడాలి..