ఏపీలో ఎమ్మెల్సీ ఎల‌క్ష‌న్‌… వైసీపీకి టెన్ష‌న్ ఇక్క‌డే…!

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి రాజుకుంది. స్థానిక సంస్థ‌లు, ప‌ట్ట‌భ‌ద్రులు, ఉపాధ్యాయ కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ నెల 27తో నామినేష‌న్ల‌కు గ‌డువు ముగుస్తుంది. వ‌చ్చే నెల 14తో ఎన్నిక‌ల ప్ర‌క్రియ కూడా పూర్త‌వుతుంది. అయితే.. ఈ మూడు ఎన్నిక‌ల్లోనూ. అధికార పార్టీ స‌త్తా చాటాల‌నేది వ్యూహం. ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల‌ను తీసుకుంటే.. ఎలానూ వైసీపీకే బ‌లం ఉంది.

గ‌త ఏడాది జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో అన్నీ వైసీపీనే ద‌క్కించుకున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఆయా స్థానిక సంస్థ‌ల ప‌రిధిలో జ‌రుగుతున్న ఎన్నిక‌లు కావ‌డంతో వైసీపీకే బ‌లం ఉంది. సో.. ఇవి గెలిచే అవ‌కాశం ఉం ది. అయిన‌ప్ప‌టికీ.. స్థానిక సంస్థ‌ల‌కు నిధులు ఇవ్వ‌డంతో చేస్తున్న తాత్సారం.. అభివృద్ధి లేక‌పోవ‌డం వంటి కార‌ణంగా.. స్థానిక సంస్థ‌ల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది.

దీంతో ఎక్క‌డిక‌క్క‌డ మెజారిటీ స్థానాల‌ను ఏక‌గ్రీవం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇదిలావుంటే.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లోనూ త‌మ మ‌ద్ద‌తుగా ఉన్న అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల వంద‌ల కొద్దీ.. న‌కిలీ ఓట‌ర్లు వ‌చ్చారంటూ.. టీడీపీ, వామ‌ప‌క్షాలు ఫిర్యాదు చేయ‌డం.. ఎన్నిక‌ల సంఘం ప‌రిశీల‌న చేసి.. ఆయా ఓట్ల‌ను తొలిగించ‌డం తెలిసిందే.

అయిన‌ప్ప‌టికీ.. ఎక్క‌డో తేడా కొడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు మాత్రం కీల‌కంగా మారాయి. ఎక్కువ‌గా నామినేష‌న్లను తిర‌స్క‌రించ‌ని ఎన్నిక‌లు కూడా ఇదే. ఒక్క ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల‌ను గ‌మ‌నిస్తే.. దాదాపు ఈ ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలోనే 44 నామినేష‌న్లు ప‌డ్డాయి వీటిలో కేవ‌లం 4 మాత్రం అన‌ర్హ‌మైన‌విగా గుర్తిస్తే.. మిగిలిన 40 మంది అభ్య‌ర్తులు పోటీ ప‌డుతు న్నారు. దీంతో ఈ ఒక్క సీటు మాత్రం హాట్‌హాట్‌గా మార‌డం విశేషం.