ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కాకినాడ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో వెంటనే హైదరాబాద్ కు పయనమయ్యారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన ఉత్సాహంగా కనిపించారు. అనంతరం జరిగిన సభలో యువతను ఉద్దేశించి అమూల్యమైన సందేశం ఇచ్చారు. వేడుకలు ముగిసిన కొద్ది సేపటికే తీవ్రమైన జ్వరం వచ్చింది.
వెంటనే రాజమండ్రిలో వైద్యులను సంప్రదించారు. వైద్య పరీక్షల అనంతరం వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ కు పయనం అయ్యారు. అమరావతిలో గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరుకాలేక పోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
నిజానికి పవన్ కళ్యాణ్ భుజం నొప్పితోనే స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. తీవ్రమైన నొప్పితోనే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల తర్వాత నొప్పి తీవ్రం కావడమే కాకుండా తీవ్ర జ్వరం వచ్చింది. ఇటీవలే ఆయన కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్యులు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చినప్పటికి విధులకు హాజరవుతున్నారు. దాంతో నొప్పి తిరగబట్టినట్లుందని సన్నిహితులు చెబుతున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తీవ్రమైన జ్వరం వచ్చిందని తెలియగానే అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. పవన్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళిపోయినట్లు తెలిసి ఏమైందని వాకబు చేస్తున్నారు. కొందరు అభిమానులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates