జగన్ సభ.. అధికారుల తిప్పలు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా ఇప్పుడు జనం రావడం లేదు. జనాన్ని తోలేందుకు అధికారులు, అధికార పార్టీ వారు చేయని ప్రయత్నం లేదు. జగన్ పేరు చెబితే సభకు వచ్చేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న చర్చ కూడా ఊపందుకుంది..

తెనాలి సభ

గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ పంపిణీ కార్యక్రమాలకు జనాన్ని తరలించే ప్రక్రియలో అధికార వర్గాలకు తల ప్రాణం తోకకు వచ్చింది. ముందు రోజు నుంచి బస్సులను సిద్ధం చేసినా వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దానితో డ్వాక్రా సంఘాలంతా విధిగా హాజరు కావాలంటూ విప్ జారీ చేసినంత పని చేశారు. పైగా సభ దగ్గర డ్వాక్రా సంఘాలు గ్రూపు ఫోటో తీసుకుని అప్ లోడ్ చేయాలని కూడా ఆదేశించారు. అలాగైనా భయపడి మహిళలు వస్తారని వారి నమ్మకం కావచ్చు..ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో పాటు ఇంటి నుంచి తీసుకెళ్లి, మళ్లీ ఇంట్లో దిగబెట్టే బాధ్యతను కూడా అధికారులు తీసుకున్నప్పటికీ ప్రజాస్పందన అంతంతమాత్రంగానే ఉంది..

జగన్ మాట్లాడుతుండగానే..

గతంలో జరిగిన కొన్ని సభల్లో సీఎం జగన్ మాట్లాడుతుండగానే జనం వెళ్లిపోవడం మొదలు పెట్టారు. అలా వందలమంది వెళ్లిపోతుంటే అధికారులు విస్తుపోయి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. జగన్ మంచి స్పీకర్ కాకపోవడం, జనం పై సమ్మోహనాస్త్రాలు వేయలేకపోవడంతో బోర్ కొట్టి ప్రజలు వెళ్లిపోతున్నారని కూడా టాక్ నడిచింది.

ఆపుతున్న పోలీసులు

జనం వెళ్లిపోకుండా ఆపాల్సిన బాధ్యతను కొన్ని సభల్లో పోలీసులకు అప్పగించారు. దానితో ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర అడ్డం నిల్చున్న పోలీసులు జనం వెళ్లిపోకుండా ఆపిన సందర్భం ఉంది. తోసుకుని వెళ్లాలనుకునే వారిపై సామదానభేదదండోపాయాలను కూడా వినిపోగించారు. అయితే భరించలేక కొందరు బ్యారికేడ్ల పై నుంచి దూకి వెళ్లిపోయిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి.

నిరసనల భయం

వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో సభల్లో నిరసనల భయం కూడా నెలకొంది ఎక్కడ నల్ల జెండాలు చూపిస్తారోనని పోలీసులు తెగ జాగ్రత్త పడ్డేవారు. మహిళలు, అమ్మాయిలు నల్ల చున్నీలతో వచ్చినా వాటిని బయటపెట్టమని చెప్పి పంపించేవారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు తమ చున్నీలను బయట పెట్టేసి వెళ్లడం తీవ్ర చర్చకు దారి తీసింది.అయినా వైసీపీ ప్రభుత్వ తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు…