కేసీఆర్ తీరు బాగోలేదు.. ఇదేం ప‌ద్ధ‌తి: సుప్రీం కోర్టు ఫైర్‌

మొయినాబాద్‌లో జ‌రిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం కేసుకు సంబంధించి విచార‌ణ చేస్తున్న దేశ అత్యున్న‌త ధ‌ర్మాస‌నం సుప్రీంకోర్టు తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కేసీఆర్ తీరు ఏం బాగోలేద‌ని.. ఇదేం ప‌ద్ధ‌త‌ని ప్ర‌శ్నించింది. అంతేకాదు.. సీఎం అనుసరించిన పద్ధతి సరికాదని పేర్కొంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన ఆడియో, వీడియోలను సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల‌కు నేరుగా ఎలా పంపుతార‌ని నిల‌దీసింది. ఈ మేర‌కు కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్‌తో కూడిన‌ ధర్మాసనం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

దీంతో ఉలిక్కిప‌డ్డ తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున హాజ‌రైన న్యాయ‌వాది దుష్యంత్ ద‌వే.. న్యాయమూర్తులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు. సారీ చెబుతున్నామ‌ని అన్నారు. న్యాయ‌మూర్తుల‌కు ఆడియో.. వీడియో రికార్డుల‌ను పంపడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేద‌ని, పార‌ద‌ర్శ‌క‌మైన తీర్పు, విచార‌ణ కోస‌మే పంపామ‌ని.. అయినా కూడా సుప్రీంకోర్టును ఇబ్బంది పెట్టి ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటామ‌న్నారు. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఆడియో, వీడియో క్లిప్పులను సుప్రీం కోర్టు జడ్జిలు సహా దేశంలోని ప్రముఖులకు కేసీఆర్ పంపించిన విష‌యం తెలిసిందే.

ఇదిలావుంటే, ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో మొయినాబాద్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం సంచ‌ల‌నం రేపిన విష‌యం తెలిసిందే. ఈ కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అయితే.. తామే సిట్ వేసినందున సిట్ విచార‌ణ చేస్తుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం వాదిస్తోంది. ఈ నేప‌థ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. సీబీఐ చేతిలోకి కేసు వెళ్తే… ఇప్పటి వరకు చేసిన విచారణ అంతా పక్కదారి పడుతుందని ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్లు సిద్ధార్థ లూత్రా, దుష్యంత్ దవేలు వాదనలు వినిపించారు.

ఈ కేసులో ఆధారాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారని వాదించారు. కేసుపై వాదించేందుకు త‌న‌కు మరింత సమయం కావాలని కోరారు. మరోవైపు కేసులో కీలక ఆధారాలు లీక్ చేశారన్న విషయాన్ని ప్రతివాదుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్ గవాయ్.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆధారాలను మీడియాకే కాదు.. జడ్జీలకు పంపారని, ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌ని వ్యాఖ్యానించారు.