రాజ‌కీయాల‌కు సోనియా గుడ్ బై!

దేశ స్వాతంత్ర సంగ్రామంలో కీల‌క పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీని రెండు ద‌శాబ్దాల పాటు ముందుండి న‌డిపిన ఆ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. త్వ‌ర‌లోనే తాను రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్ర‌క‌టించారు. తన ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిసినందుకు సంతోషంగా ఉందన్న ఆమె. ఇది పార్టీకి టర్నింగ్ పాయింట్ అవుతుంద‌ని పేర్కొన్నారు.

మూడు రోజుల పార్టీ ప్లీనరీలో 1500 మంది ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన సోనియా.. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగియడం చాలా సంతోషాన్ని ఇచ్చినట్లు తెలిపారు. ఈ యాత్ర కాంగ్రెస్‌ పార్టీకి టర్నింగ్‌ పాయింట్‌ అయిందన్నారు. దేశ ప్రజలు సామరస్యం, సహనం, సమానత్వాన్ని కోరుకుంటున్నార ని.. భారత్‌ జోడో యాత్రగా రుజువైనట్లు సోనియా తెలిపారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వం లో వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సోనియా పిలుపునిచ్చారు.

అయితే.. సోనియా సార‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు వ‌రుస‌గా అధికారంలోకి వ‌చ్చింది. అదేస‌మ‌యంలో పార్టీలోనూ ఆమె త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో త‌ర‌చుగా ముఖ్య‌మంత్రుల ను మార్చే సంప్ర‌దాయాన్ని ప‌క్క‌న పెట్టి.. నేత‌ల‌కు స్వేచ్ఛ క‌ల్పించారు. అంతేకాదు.. ఉపాధి హామీ వంటి కీల‌క‌మైన ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చారు. ఆధార్ వంటి వ్య‌వ‌స్థ‌ను కూడా తీసుకురావ‌డంలో సోనియా త‌న‌దైన దూకుడుతో ముందుకు వెళ్లారు.

అయితే.. ఎక్క‌డా కూడా ప్ర‌భుత్వంలో ప్ర‌త్య‌క్ష పాత్ర పోషించ‌ని సోనియా.. తెర‌వెనుక మాత్రం అన్నీ తానై వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకొని.. యూపీఏ స‌ర్కారును స‌మ‌ర్థ‌వంతంగా ప‌దేళ్ల పాటు పాలించేలా ముందుండి.. వ్యూహ ర‌చ‌న కూడా చేసిన ఘ‌న‌త సోనియాకు మాత్ర‌మే ద‌క్కుతుంది.