జగన్మాయ: విశాఖలో అదానీ ‘కొండ’?

ఒక రాజధానేంటి? మూడు రాజధానులతో ఏపీని ఎక్కడికో తీసుకెళతానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన అధికారానికి ఆఖరి ఏడాది వరకు కూడా రాజధాని విషయంలో ఏమీ చేయని పరిస్థితి. విభజన గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటూ అమరావతి కోసం వేలాది రైతుల నుంచి భూములు తీసుకోవటం మొదలు.. శంకుస్థాపన చేసి.. భారీ ఎత్తున భవనాల్ని నిర్మిస్తే.. గ్రాఫిక్స్ అంటూ ఎద్దేవా చేసిన జగన్త మ పాలనతో చేసిందేమిటి? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పని పరిస్థితి ఉందంటున్నారు పరిశీలకులు.

అమరావతి రాజధాని కాదు.. విశాఖను రాజధానిగా పేర్కొనటమే కాదు.. డెవలప్ మెంట్ విషయంలో విశాఖను అక్కడెక్కడికో తీసుకెళతానని చెప్పిన ప్రభుత్వం.. 302 ఎకరాల్లో నాలెడ్జ్ పార్కును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. విశాఖలోని కాపులుప్పాడలో ఏపీఐఐసీ ఏర్పాటు చేసిన నాలెడ్జ్ పార్కు కోసం హిల్ నెంబరు 4ను సిద్ధం చేశారు. ఇందులో చంద్రబాబు ప్రభుత్వంలో బహుళజాతి సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కు 40 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. తర్వాత మరో సంస్థను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత హిల్ 4లో అదానీ డేటాసెంటర్ కోసం 130 ఎకరాల్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మరో తొమ్మిది ఎకరాల్ని అదానీ సంస్థకు కట్టబెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేయకున్నప్పటికీ తాజాగా అదానీకి మరో 60 ఎకరాల్ని జగన్ ప్రభుత్వం కేటాయించిన వైనం సంచలనంగా మారింది. అంటే.. ఇప్పటివరకు అదానీకి ఇచ్చిన భూమి ఏకంగా 199 ఎకరాలు. కానీ.. ఇప్పటివరకు అక్కడ ఎలాంటి నిర్మాణం షురూ కాలేదు.

ఇదే కొండ మీద కేంద్ర రక్షణ రంగ అభివృద్ధి సంస్థ డీఆర్డీవో కు ఐదు ఎకరాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. ఐటీ కోసం సెంటినల్ టవర్లు నిర్మిస్తామని కూడా చెప్పారు. ఇలా పలు సంస్థల పేర్లతో కూడిన బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అంతా బాగానే ఉంది కానీ తాజాగా సీన్ మారింది. తాజాగా అదానీకి ఈ హిల్ లో మరో 60 ఎకరాలు కేటాయించారో అప్పటి నుంచి బోర్డు కూడా మారిపోయింది. ఇప్పటివరకు అక్కడున్న సంస్థల పేర్లు తొలగించి.. ఏపీఐఐసీ నాలెడ్జ్ పార్కు అన్న పేరుతో ఉన్న బోర్డును మాత్రమే ఉంచారు.

గతంలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మీద వైసీపీ పెద్దలు ఒత్తిడి తెచ్చినట్లుగా చెబుతున్నారు. పాత ధర కాదని కొత్త ధర ఇవ్వాలన్న పేచీతో ఒప్పందాలు మారినట్లుగా చెబుతున్నారు. ఎంత ప్రభుత్వాలు మారితే ఒప్పందాల్లోనూ మార్పులు చోటు చేసుకోవటమా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు 302 ఎకరాలు ఉన్న హిల్ 4లో వివిధ సంస్థలకు చెందిన కార్యాలయాలు ఓపెన్ అవుతాయన్న దానికి భిన్నంగా తాజాగా అదానీకి కొండ మొత్తాన్ని అప్పగించే కార్యక్రమం జోరుగా సాగుతున్నట్లుగా చెబుతున్నారు. అదానీనా మజాకానా.