ఆ నలుగిరిపై 26న ఫిర్యాదు

ఏపీ బీజేపీలో అసమ్మతి రోజు రోజుకు పెరుగుతోంది. కన్నా లక్ష్మీ నారాయణ నిష్క్రమణ తర్వాత కమలం పార్టీలోని అసమ్మతి వాదులంతా గళం విప్పేందుకు సిద్ధమవుతున్నారు. సోము వీర్రాజు సంగతి తేల్చేయ్యాల్సిందేనని, ఆయన నాయకత్వంలో పనిచేయలేమని చెప్పేందుకు రెడీ అవుతున్నారు. వీర్రాజు, జీవీఎల్ సహా నలుగురు నేతల పెత్తందారీతనాన్ని భరించలేకపోతున్నామని బీజేపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి.

మంగళవారం మీటింగ్ కేన్సిల్

వీర్రాజుకు వ్యతిరేకంగా అసమ్మతి వాదులు మంగళవారం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంగతి ఎలాగో ఢిల్లీలోని అధిష్టానానికి చేరింది. ఏపీ వ్యవహారాలను చేసూ శివప్రకాష్ రంగంలోకి దిగి ఎలాంటి మీటింగులు పెట్టవద్దని, అలాంటి చర్యలతో పార్టీ పరువు దెబ్బతింటుందని అభ్యర్థించారు. దానితో రెబెల్స్ కాస్త మెత్తబడ్డారు. ఈ నెల 26న ఢిల్లీ రావాలనే కూడా అసమ్మతి వాదులకు వర్తమానం అందింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో అన్ని విషయాలు మాట్లాడుకుందామని ఆయన సూచించారు..

నివేదక సిద్ధం…

వీర్రాజుకు వ్యతిరేకంగా నివేదిక సిద్ధం చేసేందుకు కూడా అసమ్మతి వాదులు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు వారంతా టెలీ కాన్ఫరెన్స్ లో బిజీగా ఉన్నారు. అందరూ చర్చించుకుని రిపోర్టు సిద్ధం చేయబోతున్నారు. కన్నా నిష్క్రమణకు దారి తీసిన పరిణామాలు కూడా అందులో వివరించనున్నారు. అధికార పార్టీ తప్పిదాలను ఎండగడుతూ బీజేపీని అభివృద్ధి చేయాల్సిన తరుణంలో కొంత మంది నేతలు వేసీపీతో కలిసిపోయి సొంత పార్టీని దెబ్బతీసే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించనున్నారు. అరడజను మంది జిల్లా అధ్యక్షులను వీర్రాజు తొలగించిన తీరు కూడా ప్రస్తావించబోతున్నారు.

అవినీతి ఆరోపణలు

సోము వీర్రాజుపై వస్తున్న అవినీతి ఆరోపణలను కూడా అసమ్మతి వాదులు అధిష్టానం దృష్టికి తీసుకురాబోతున్నారు. వైసీపీ అండతో వీర్రాజు కొన్ని అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి ప్రయోజనాలను ఆశించే వీర్రాజు, వైసీపీకి కొమ్ము కాస్తున్నారన్నది పార్టీలో పలువురి వాదన. మరి ఈ నెల 26న నడ్డా ఎలాంటి దిశా నిర్దేశం చేస్తారో చూడాలి…