డైలామాలో కాపులు.. కిం క‌ర్త‌వ్యం?

అదేంటి.. అనుకుంటున్నారా? ఔను! నిజ‌మే. కాపు సామాజిక వ‌ర్గం ఇప్పుడు పూర్తిస్థాయి డైల‌మాలో ప‌డిపోయింది. తాము ఒంట‌రిగా ఎద‌గాల‌ని.. రాజ‌కీయంగా శాసించాల‌ని.. త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయకుడే ముఖ్య‌మంత్రి కావాల‌ని కొన్నాళ్లుగా కాపులు ఉద్య‌మిస్తున్నారు. పైకి మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. త‌ర‌చుగా మాత్రం ఈ డిమాండ్ వారి నోటి నుంచి వినిపిస్తూనే ఉంది. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో మారుతున్న ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. వారంతా డైల‌మాలో ప‌డిపోయిన‌ట్టు తెలుస్తోంది.

నిజానికి కాపులు జ‌న‌సేన పార్టీపై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. ప‌వ‌న్‌ను ముఖ్య‌మంత్రిగా చూడాల‌నేది వారి చిర‌కాల వాంఛ‌గా మారిపోయింది. ఆ మాట‌కొస్తే… మెగా కుటుంబం నుంచి ఒక‌రిని కీల‌క ప‌ద‌విలో చూడాల‌నేదివారి కోరిక‌. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని.. కొన్నాళ్లు గా డిమాండ్ వినిపిస్తోంది. కొన్నాళ్ల కింద‌ట కాపు నాడు నాయ‌కులు భేటీ అయి ప‌వ‌న్ కోసం ఏమైనా చేయాల‌నే తీర్మానం చేసుకున్నారు.

కానీ, ప‌వ‌న్ మాత్రం టీడీపీ ఇత‌ర పార్టీల‌తో పొత్తుల కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌నేది కాపులు తాజాగా చేసిన ఆరోప‌ణ‌. రెండు రోజుల కింద‌ట జ‌గ్గ‌పేట‌లో నిర్వ‌హించిన అతి ర‌హ‌స్య స‌మావేశంలో ప‌వ‌న్‌పై గుర్రుగా ఉన్న నాయ‌కులు నోరు విప్పేశారు. ఇప్పుడు మ‌నం ఏం చేయాలి? అనేది వారి మ‌ధ్య ప్ర‌ధానంగా సాగిన సంభాష‌ణ‌. కాపు నాయ‌కులే కాపుల‌కు ద్రోహం చేస్తున్నార‌నే భావ‌న వారి నుంచిరావ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపించినా నిజం కూడా!

కాపులు రాజ‌కీయంగా ఎదిగేందుకు ప‌వ‌న్ ఒక వంతెన‌గా మారుతార‌ని.. ఆశించామ‌ని, కానీ, ఆయ‌న టీడీపీతో పొత్తు కోస‌మే రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఒక‌రిద్ద‌రు నాయ‌కులు బాహాటంగానే విమ‌ర్శించారు. టీడీపీ తో పెట్టుకుని కాపుల‌కు న్యాయం జ‌రుగుతుందా? అని మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు. కాపుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ఒక‌టి రెండు మంత్రి ప‌ద‌వులు ఇచ్చేస్తే.. స‌రిపోతుందా? అని మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు. ఈ స‌మావేశంలో కొంద‌రు నాయ‌కులు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది.

కాపుల‌ను విడ‌దీసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని క‌న్నాపై ఆరోప‌ణ‌లు చేసిన‌ట్టు తెలిసింది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో కాపులు వ్య‌క్తిగ‌తంగా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు చేయాల్సిందిపోయి.. మ‌ళ్లీ ఏదో ఒక పార్టీకి అంట‌కాగితే.. మ‌ళ్లీ స‌మ‌స్య‌లు య‌థాతథంగానే మిగిలిపోతాయ‌ని ఎక్కువ మంది అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే.. ఇప్పుడు ఏం చేయాల‌నే విష‌యంపై మాత్రం ఎవ‌రూ కూడా పూర్తిస్థాయిలో నిర్ణ‌యానికి రాలేక పోయారు. మ‌రోసారి భేటీ త‌ర్వాత ఏదో ఒక విష‌యాన్ని నిర్ణ‌యించాల‌ని తీర్మానం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.