ఇప్పుడు ఓపీ షీట్ల మీదా జగన్?

రాజకీయాలన్న తర్వాత ప్రచారం కీలకం. కానీ.. అదే ఒక ధోరణిగా మారకూడదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇలాంటి తీరు పీక్స్ కు చేరుకుంది. మొదట ప్రభుత్వ కార్యాలయాలకు.. సర్కారీ స్కూళ్లకు పార్టీ జెండా రంగుల్ని అద్దేసి వివాదానికి తెర తీసిన ఆయన.. ఈ మధ్యన ఇళ్లకు స్టిక్కర్లు అంటించటం వరకు దాన్ని తీసుకెళ్లారు. సర్లే అనుకుంటున్న వేళ.. మొబైల్ ఫోన్లకు స్టిక్కర్లు అతికించాలన్న ఏపీ అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వివాదం అలానే ఉన్న వేళ.. మరో కొత్త అంశం తెర మీదకు వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చే రోగులకు వైద్యులు ఇచ్చే ఓపీ షీట్ల మీద ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ఉండటంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. రోగికి ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? దాని కోసం వాడాల్సిన మందులేమిటి? అన్నది చీటీ మీద ఉండాలే తప్పించి.. ముఖ్యమంత్రి ఫోటోను వాడాల్సిన అవసరం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ప్రభుత్వం అన్న తర్వాత ప్రచారం చేసుకోవటం తప్పు కాదు.కానీ.. ఎక్కడ చూసినా తన ఫోటోనే ఉండాలన్నట్లుగా ముఖ్యమంత్రి భావించటమే అసలు సమస్యగా మారిందని చెప్పాలి. భూముల్లో పాతే సర్వే రాళ్ల పైనా తన బొమ్మను చెక్కించుకున్న జగన్.. ఆ తర్వాత రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల మీదా.. శ్మశానం గోడలు.. కాలనీ ల ఆర్చ్ ల మీదా బొమ్ములు వేయించుకోవటం.. పార్టీ రంగులు వేయటం తెలిసిందే.

ఇప్పటికే ఇలాంటి విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటూ.. ఈ ధోరణి మరీ అతిగా ఉందన్న మాట అనిపించుకున్న ఆయన.. తనకున్న ఫోటోల యావకు పరాకాష్ఠగా ఆసుపత్రుల్లో రోగులకు ఇచ్చే ఓపీ షీట్ల మీదా తన ఫోటోలను ముద్రించాలన్న నిర్ణయాన్ని తీసుకోవటాన్ని తప్పు పడుతున్నారు. సర్కారీ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి చేతికి ఓపీ కార్డు ఇస్తారు. దీని పైనా సీఎం జగన్ బొమ్మను ముద్రించారు.

సాధారణంగా రోగులకు ఇచ్చే రికార్డుల్లో వైద్యుల పేర్లు.. వారి విద్యార్హత.. సదరు ఆసుపత్రికి సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటాయి. వీటి మీద కూడా తన ఫోటో ఉండాలన్న తపన జగన్ కు మంచిది కాదంటున్నారు. ఇలాంటి నిర్ణయాలతో ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న గౌరవం పోతుందన్న మాటవినిపిస్తోంది. మరి.. ఏపీ ప్రభుత్వానికి వందకు పైగా ఉన్న సలహాదారులు.. ఇలాంటి విషయాల్ని ప్రభుత్వానికి ఎందుకు చెప్పరు? వారున్నది ఎందుకు? అన్నది అసలు ప్రశ్నగా మారింది.