బొత్స రెడీ… లోకేశ్ దే లేట్

వైసీపీ కీలక నేత, ఏపీ శాసనమండలిలో విపక్ష నేతగా సాగుతున్న బొత్స సత్యనారాయణ సెలవు దినం అయిన ఆదివారం అధికార కూటమి సర్కారుకు పెను సవాలే విసిరారు. మేం తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోండి బాసూ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. శనివారం పార్లమెంటు ముందుకు వచ్చిన కేంద్ర బడ్జెట్ పై స్పందించేందుకు ఆదివారం బొత్స మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్బంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

కేంద్ర బడ్జెట్ లో మరోమారు ఏపీకి అన్యాయం జరిగిందని బొత్స ఓ రూలింగ్ ఇచ్చేశారు. అదే సమయంలో మరోమారు బీహార్ కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించిందని కూడా ఆయన ఆరోపించారు. టీడీపీ తరఫున 16 మంది ఎంపీలున్నా… ఏపీకి అన్యాయం జరిగిందని ఆయన ఆవేన వ్యక్తం చేశారు. టీడీపీతో పాటు జనసేన, బీజేపీలకు కూడా ఏపీలో ఎంపీలున్న విషయాన్ని ప్రస్తావించిన బొత్స… ఏపీకి అన్యాయం జరుగుతూ ఉంటే… అందరూ చోద్యం చూశారని మండిపడ్డారు. ఇది రాష్ట్రాభివృద్ధికి మంచి పద్ధతి కాదని కూడా బొత్స వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత వైసీపీ సర్కారులో పెద్ద ఎత్తున తప్పులు జరిగాయంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలపై బొత్స స్పందించారు. ఈ సందర్భంగా తాను నిర్వహించిన విద్యా శాఖలో అక్రమాలు జరిగాయంటూ సాగుతున్న అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. వైసీపీ హయాంలో తప్పులు జరిగి ఉంటే.. విచారణ చేసి చర్యలు తీసుకోండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన విద్యా శాఖలో నాడు-నేడులో తప్పులు జరిగాయంటే తనపైనా చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు. డిజిటలైజేషన్ లో అక్రమాలు జరిగినా చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వం వహిస్తున్న విద్యా శాఖలో అక్రమాలు, చర్యలపై బొత్స చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలకు తెర లేపింది.