ఈ సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేశాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఒకటేమో ఏకంగా 400 కోట్ల బడ్జెట్ పెట్టి, రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్, ఇంకోటేమో మీడియం బడ్జెట్లో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం. ఐతే భారీ బడ్జెట్, క్రేజీ కాంబినేషన్ ఉన్నా గేమ్ చేంజర్ బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. కానీ మిడ్ రేంజ్ మూవీ అయిన సంక్రాంతికి వస్తున్నాం లాభాల పంట పండించింది.
సంక్రాంతి వస్తున్నాం సినిమానే లేకపోతే.. గేమ్ చేంజర్ కొట్టిన దెబ్బకు దిల్ రాజు కుదేలైపోయేవాడు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ఏర్పాటు చేసిన సక్సెస్ ప్రెస్ మీట్లో దిల్ రాజు గేమ్ చేంజర్ విషయంలో తన ఆవేదనను, అసహనాన్ని పరోక్షంగా బయటపెట్టేశాడు. సినిమాకు కావాల్సింది భారీ బడ్జెట్ కాదని.. కంటెంట్ అని దిల్ రాజు ఈ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు. అంతే కాక కాంబినేషన్లను నమ్ముకుని సినిమాలు తీస్తే లాభం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించాడు.
తమ సంస్థలో క్లాసిక్స్, బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సినిమాలన్నీ కథను నమ్ముకుని చేసినవే అని.. ఎక్కువమంది కొత్త దర్శకులతో ఘనవిజయాలు సాధించామని.. కానీ గత కొన్నేళ్ల నుంచి మిగతా వాళ్ల లాగే కాంబినేషన్ల మీద ఫోకస్ చేసి సినిమాలు తీయడంతో ఎదురు దెబ్బలు తిన్నామని రాజు వ్యాఖ్యానించాడు. ఐతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించి అనిల్ రావిపూడి తమను ట్రాక్లో పెట్టాడని.. ఇది తమకు ఒక పాఠమని రాజు అన్నాడు.
తద్వారా ఇకపై బడ్జెట్, కాంబినేషన్లను నమ్మి సినిమా తీయమంటూ తన బాధను రాజు వెళ్లగక్కినట్లయింది. మరోవైపు తీవ్ర చర్చనీయాంశంగా మారిన గేమ్ చేంజర్ తొలి రోజు కలెక్షన్ల పోస్టర్ గురించి ఓ విలేకరి అడిగితే.. అది తమ వీక్నెస్, అలా ఎందుకు జరిగిందో, వాస్తవాలేంటో మీకు తెలియదా అని ప్రశ్నించడం ద్వారా ఆ పోస్టర్ ఫ్యాన్స్ కోసం అయిష్టంగానే రిలీజ్ చేసినట్లు రాజు ఒప్పేసుకున్నట్లయింది.