పూరి తమ్ముడిది పెద్ద ధైర్యమే

కొత్త ఏడాదిలో రెండో నెల వచ్చేసింది. సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు వచ్చిన తర్వాత బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సౌండ్ లేదు. ఒక్క వెంకటేష్ మాత్రమే మూడు వందల కోట్లతో నాన్ స్టాప్ బ్యాటింగ్ చేస్తుండగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న బాలకృష్ణ ఫైనల్ రన్ కు దగ్గర్లో ఉన్నారు. ఇక తర్వాత వచ్చినవేవి కనీస ప్రభావం చూపించలేకపోయాయి.

ఈ నేపథ్యంలో అందరి కళ్ళు నాగచైతన్య తండేల్ మీదకు వెళ్తున్నాయి. గీతా ఆర్ట్స్ నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కావడంతో పోటీకి ఎవరూ రిస్క్ చేయలేదు. కానీ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ ఫిబ్రవరి 7నే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడుతున్నాడు.

ఇది ఒక రకంగా చాలా పెద్ద ధైర్యం. ఎందుకంటే సాయిరామ్ శంకర్ సోలో హీరోగా మార్కెట్ ని ఎప్పుడో కోల్పోయాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆడియన్స్ తనని మర్చిపోయారు. ఒకప్పుడు బంపర్ ఆఫర్ లాంటి హిట్లున్నా వాటిని కెరీర్ ఎదుగుదలకు మలుచుకోవడంలో విఫలమయ్యాడు. ఇప్పుడు రిలీజవుతున్న ఒక పధకం ప్రకారం క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందింది.

ఇంటర్వెల్ లో హంతకుడు ఎవరో కనిపెట్టగలిగితే ప్రతి థియేటర్ లో ఒక లక్కీ విజేతకు పది వేల రూపాయలు గిఫ్ట్ ఇస్తామని ప్రకటించడం ఎంతమేరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేం. బజ్ పరంగా పెద్దగా పనవుతున్నట్టు కనిపించడం లేదు.

పైగా ఒక రోజు ముందు అజిత్ పట్టుదల కూడా రిలీజవుతోంది. ఇదేమి కాంపిటీషన్ కాకపోయినా ఒక పధకం ప్రకారంకు హైప్ అయితే లేదనేది వాస్తవం. సో టాక్ రావడం చాలా కీలకం. వచ్చే వారం ఫిబ్రవరి 14న మరో మూడు సినిమాలు వస్తున్నాయి. ఆలోగానే సాయి రామ్ శంకర్ వీలైనంత రాబట్టుకుని సేఫ్ అయిపోవాలి.

దర్శకుడిగా తన పట్టు కోల్పోయిన పూరి జగన్నాథ్ ఆ మధ్య డబుల్ ఇస్మార్ట్ తో ఎలాంటి ఫలితం అందుకున్నారో చూశాం. ఆకాష్ పూరి సైతం కనీస హిట్ లేక స్ట్రగుల్ అవుతున్నాడు. ఇప్పుడు కాస్త ఊరట దక్కేలా సాయిరామ్ శంకర్ ఏమైనా మేజిక్ చేస్తాడో లేక పాత రూట్ లో వెళ్తాడో చూడాలి.