డైవర్షన్ కోసమే చంద్రబాబును ఆపుతున్నారా..

ఆంధ్రప్రదేశ్‌లో విపక్షం రోజురోజుకు బలపడుతోంది. జగన్ సర్కారు అంతే స్థాయిలో బలహీనపడుతోంది. వైసీపీ పాలనపై ప్రజాగ్రహం పెల్లుబికింది.దానితో చంద్రబాబు, లోకేష్ ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు.

రోడ్డుకు అడ్డంగా వాహనాలు

అనపర్తిలో చంద్రబాబు పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లు విధించారు. వాహనాలు అడ్డుపెట్టారు. టీడీపీ వాహనాలు రాకుండా పోలీసులే రోడ్డుపై కూర్చున్నారు. రోడ్డుపై సభకు అనుమతి లేదని ప్రకటించారు. వేరే చోట సభ పెట్టుకోవాలని ఒక సలహా పడేశారు. దానితో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం చెందారు. పోలీసులకు సహాయ నిరాకరణ ప్రకటించారు. పోలీసుల ఆంక్షలు పట్టించుకునే ప్రసక్తే లేదన్నారు… వాహనం దిగి నడవడం మొదలు పెట్టారు. అలా ఎనిమిది కిలోమీటర్లు నడిచి సభా స్థలానికి చేరుకున్నారు. అక్కడా ఉద్రిక్త వాతావరణమే కనిపించింది..

వైసీపీ గేమ్ ప్లాన్

ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. ప్రభుత్వోద్యోగులు, ఇతరులు అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు. అధికారపార్టీలోనే కల్లోలం నెలకొంది. ఎమ్మెల్యేలు తిరగబడుతున్నారు. ఎమ్మెల్యేలపై జనం తిరగబడుతున్నారు. దానితో ప్రభుత్వానికి డైవర్షన్ అవసరమమవుతోంది. అదే చంద్రబాబును అడ్డుకోవడానికి కారణమవుతోంది. అంతం కాదిది ఆరంభం అన్నట్లుగా అనవర్తి నుంచి ప్రారంభమైంది. ఇక రోజు వారీ ఇలాంటి చర్యలే ఉంటాయని భావిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ఇతర ప్రతిపక్ష నేతలు ఎక్కడికి వెళ్లినా వివిధ రూపాల్లో అడ్డుకోవడం ఖాయమనిపిస్తోంది…