ఏలూరు ఎంపీ సీటుపై మాజీ డిప్యూటీ సీఎం కన్ను

జగన్ కేబినెట్లో మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేసి.. కేబినెట్ విస్తరణ సమయంలో పదవి కోల్పోయిన ఆళ్ల నాని ఇప్పుడు కొత్త అడుగులు వేయబోతున్నారట. అందుకు ఆయన రంగం మొత్తం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జగన్ మంత్రివర్గంలో మొదటి విడతలోనే ఆరోగ్య మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పెద్ద పెద్ద పదవులు అందుకున్న ఆయన మంత్రివర్గ విస్తరణ సమయంలో పదవి పోగొట్టుకున్నారు. దశలవారీగా వీలైనంత ఎక్కువ మందికి పదవులు ఇవ్వాలన్న జగన్ లెక్క ఆయనకు బాగా అర్థమైనట్లుంది.. అందుకే ఒకవేళ్ల వచ్చే ఎన్నికల్లో తాను గెలిచి, జగన్ ప్రభుత్వం ఏర్పడినా తనకు మంత్రి పదవి రావడం కష్టమేనని భావించిన ఆయన పదవి లేకుండా అసెంబ్లీ నియోజకవర్గంలో తిరగడం కంటే ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టడం బెటరని భావిస్తున్నారట.

డిప్యూటీ సీఎంగా పనిచేసినా ఆళ్ల నాని పదవి పోయిన తరువాత పెద్దగా యాక్టివ్‌గా లేరు. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణలోనూ ఆయన బాగా వెనుకబడిపోయారు. దీంతో జగన్ ఆయనకు అక్షింతలు కూడా వేశారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కాపు ఫ్యాక్టర్ తీవ్రంగా ఉండనుంది. ఆళ్ల నాని కాపు సామాజికవర్గానికి చెందిన నేతే అయినప్పటికీ నియోజకవర్గంలో జనసేన, టీడీపీలకు ఈసారి అనుకూలంగా ఉండొచ్చన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గెలుపుపై ఆళ్ల నాని అనుమానంగా ఉన్నారని.. అసెంబ్లీకి పోటీ చేస్తే ఓడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి లోక్ సభకు పోటీ చేస్తే గెలుపు ఈజీ అవుతుందని భావిస్తున్నారట.

ఏపీలో కాపుల జనాభా అధికంగా ఉన్న లోక్ సభ సీట్లలో ఏలూరు కూడా ఒకటి. దీని పరిధిలోని 7 నియోజకవర్గాలలో 5 నియోజకవర్గాలలో కాపులదే డామినేషన్. దీంతో లోక్ సభకు పోటీ చేయడం బెటరని ఆళ్ల నాని అనుకుంటున్నారు. ఒకవేళ టీడీపీ, జనసేన పొత్తుల కారణంగా ఏపీలో వైసీపీ అధికారం కోల్పోతే ఇబ్బందులు పడకుండా ఎంపీగా ఉండడం నయమనే ఆలోచనకు వచ్చిన ఆయన ఇప్పటికే తన ఆసక్తిని జగన్ ముందు ఉంచినట్లు సమాచారం.

అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఆళ్ల నాని ఏలూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయమని పార్టీలో ఇప్పటికే వినిపిస్తోంది. తాను గెలిచినా, పార్టీ గెలిచినా కూడా తనకు వచ్చేసారి మంత్రి పదవి రాదన్న స్పష్టత ఉండడం వల్లే ఆళ్ల నాని ఇలాంటి తెలివైన అడుగు వేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అయితే, ఆళ్ల నాని లోక్ సభకు పోటీ చేసే పక్షంలో అసెంబ్లీకి ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.