రోజాకు నాగబాబు అదిరిపోయే పంచ్

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు.. ప్రతిపక్ష జనసేన నాయకులకు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలోనే వాదోపవాదాలు, విమర్శలు ప్రతి విమర్శలు సాగుతున్నాయి కొంత కాలంగా. ఈ మధ్య జనసేన నాయకులు, కార్యకర్తలు వైసీపీ నేతలు, మద్దతుదారులను ఢీ అంటే ఢీ అన్నట్లు ఎదుర్కొంటున్నారు. వాళ్లొక పంచ్ వేస్తే వీళ్లు రెండు అన్నట్లు సాగుతోంది వ్యవహారం.

మెగా ఫ్యామిలీతో ఒకప్పుడు సన్నిహితంగానే ఉన్న వైసీపీ మంత్రి రోజా.. ఇటీవల ఆ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు చేసింది. దానికి మెగా బ్రదర్ నాగబాబు దీటుగా సమాధానం ఇచ్చాడు. ప్రతిగా రోజా మళ్లీ ఆయన్ని టార్గెట్ చేసింది. తర్వాత ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది. కానీ నాగబాబు మరోసారి రోజా మీద గట్టి పంచ్ వేశాడు. ఎక్కడ ఏంటన్న వివరాలు తెలియట్లేదు కానీ.. మంత్రి రోజా ఒక మంచి నీళ్ల ట్యాప్‌ను ప్రారంభిస్తున్న ఫొటో సోషల్ మీడియాలోకి వచ్చింది.

ఈ ఫొటోను నాగబాబు షేర్ చేస్తూ.. “హంద్రీ నీవా సుజల స్రవంతిని ప్రారంభించిన రోజా. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ (మాయ) పార్టీ నాయకురాలు రోజా. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకి సాగునీరు, 33 లక్షల మందికి త్రాగు నీరు అందినట్లు సమాచారం” అని వ్యాఖ్య జోడించాడు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదే‌శ్‌లో ఉన్నపెద్ద పరిశ్రమలు బయటికి తరలి వెళ్లిపోవడమే తప్ప కొత్త ఇండస్ట్రీలు చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చిన దాఖలాలు లేవు. మామూలుగా మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో పాల్గొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కానీ వైసీపీ నేతలు.. ఇలా మంచి నీళ్ల ట్యాప్‌ల లాంటి చిన్న చిన్న ప్రారంభోత్సవాల్లో పాల్గొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి పంచ్‌లు వేయించుకోవడం మామూలే. ఈ క్రమంలోనే నాగబాబు సైతం రోజాకు అదిరిపోయే పంచ్ వేశారు. ఈ పోస్టుకు రోజాను ట్యాగ్ కూడా చేసిన నేపథ్యంలో ఆమె నాగబాబుకు ఎలా బదులిస్తుందో చూడాలి.