అక్కడ ఎమ్మెల్యేపై వైసీపీ కమ్మ నేతల తిరుగుబాటు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం వైసీపీలో తిరుగుబాటు మొదలైంది. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన సంతనూతలపాడును గత రెండు ఎన్నికలుగా వైసీపీ సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి వైసీపీ నేత సుధాకర్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ బాబును 2019లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు అభ్యర్థిగా ప్రకటించారు. పొరుగు జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ జగన్ గాలిలో ఆ ఎన్నికల్లో గెలిచిన సుధాకర్ బాబు ఆ తరువాత క్యాడర్‌లో కొందరిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా సొంత పార్టీకే చెందిన కమ్మ నేతలను ఆయన ఏమాత్రం లెక్క చేయడం లేదన్నది వారి ఆరోపణ.

అధికారుల బదిలీలలో పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల మాట అస్సలు పట్టించుకోకపోవడం… తన వ్యక్తిగత సహాయకులలో అయిదుగురికి చీమకుర్తి నగర పంచాయతీ నుంచి జీతాల చెల్లింపులు చేస్తుండడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అలాగే, తనకు అనుకూలమైన కొందరికే కాంట్రాక్టులు, ఇతర పనులు అప్పగిస్తూ కమ్మ నేతలెవరికీ ఏ పనీ ఇవ్వడం లేదన్న ఆరోపణ వచ్చింది.

ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు రెండు వర్గాలను పిలిచి మాట్లాడారు. కానీ, నాయకులు, ఎమ్మెల్యే మధ్య దూరం తగ్గలేదు. తాజాగా కొందరు నాయకులు ఆత్మగౌరవం పోరాటం పేరుతో రెండు రోజుల కిందట ఒంగోలు సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో మీటింగ్ పెట్టి 12 మందితో ఓ కమిటీ ఏర్పాటుచేశారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన సుమారు 100 మంది కమ్మ సామాజికవర్గ నేతలు ఇక్కడ సమావేశమయ్యారట. 12 మందితో కమిటీ ఏర్పాటుచేసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒత్తిడి తెచ్చి ఎమ్మెల్యే సుధాకర్ బాబు మెడలు వంచేందుకు వీరంతా నిర్ణయించినట్లు సమాచారం.