సోము గారి వీర లాజిక్

సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు. పార్టీలో ఎవరినీ లెక్కచేయరు. అందరినీ కలుపుకుపోవాలనే కోరిక లేని నాయకుడు. ఆయనదీ అంతా ఒంటెత్తు పోకడే. కన్నా లక్ష్మీ నారాయణ హయాంలో పెట్టిన జిల్లా అధ్యక్షు లను మార్చేసి ఇటీవలే ఒక వివాదానికి ఆయన కేంద్ర బిందువయ్యారు. ఆయన ఏం మాట్లాడిన పెద్ద వివాదమై కూర్చుంటున్న తరుణంలో ఇప్పుడు ఓ క్రేజీ డైలాగ్ వదిలారు..

ప్రత్యేక హోదా ఇచ్చేశాం…

వీర్రాజు లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఎప్పుడో ప్రత్యేక హోదా వచ్చేసింది. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రబాబు హయాంలోనే కేంద్ర ప్రభుత్వం , ఏపీకి హోదా ఇచ్చేసిందని ఆయనే స్వయంగా వెల్లడించారు. పైగా హోదాలో భాగంగా పార్లమెంటు సాక్షిగా 15వేల కోట్లు ఇచ్చామన్నారు. ఇంకొన్ని నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు..పైగా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని తాను చెప్పనంటున్నారు. 2014లో అధికారానికి వచ్చిన చంద్రబాబు హయాంలోనే హోదా ఇచ్చినప్పుడు ఇక అది ముగిసిన అధ్యాయమని చెప్పడం కుదరదన్నారు.

సోము వీర్రాజు వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ వారికే దిమ్మ తిరిగేవిగా ఉన్నాయి. విభజనం సమయంలో ఐదు కాదు పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలని కోరిన బీజేపీ నేతలు… మోదీ వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు. హోదా ఇవ్వడం మోదికి ఇష్టం లేదని తెలుసుకుని మాట మార్చారు. హోదా కంటే ఎక్కువ నిధులను ఏపీకి కేటాయించామని, అన్ని డిమాండ్లను నేరవేర్చుతున్నప్పుడు ఇక హోదా మాట ఎందుకని ప్రశ్నించారు. హోదా ఒక ముగిసిపోయిన అధ్యాయమని పలువురు బీజేపీ జాతీయ నేతలు చెబుతూనే ఉన్నారు. మరి వీర్రాజు తాజా ప్రకటనపై వారి స్పందన ఏమిటో చూడాలి….