ఏపీకి కాబోయే సీఎం ష‌ర్మిల: క‌డియం శ్రీహ‌రి

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల‌.. త్వ‌ర‌లోనే ముఖ్య‌మంత్రి కానున్నార‌ని.. తెలంగాణ మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు క‌డియం శ్రీహ‌రి వ్యాఖ్యానించారు. అయితే.. ఆమె సీఎం అయ్యేది తెలంగాణ‌కు కాద‌ని.. ఏపీకి ముఖ్య‌మంత్రి అవుతార‌ని చ‌మత్క‌రించారు. ఎందుకంటే.. ఆమె అన్న‌.. ఏపీ సీఎం జ‌గ‌న్ త్వ‌ర‌లోనే జైలు యాత్ర చేయ‌నున్నార‌ని.. దుయ్య‌బ‌ట్టారు. ఈ క్ర‌మంలో సీఎం సీటును ఆమెకు ఇస్తార‌ని.. ఇవ్వ‌క‌పోయినా.. ఆమె ఆక్ర‌మించుకుంటార‌ని వ్యాఖ్యానించారు.

క‌డియం చేసిన ఈ హాట్‌ కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. షర్మిల చేపట్టిన పాదయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. ఆమె ఏ ప్రాంతంలో పాదయాత్ర చేపట్టినా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ క్ర‌మంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి.. షర్మిల చేసిన కామెంట్స్ కు కౌంట‌ర్ వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ కుటుంబం మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగానే ఉందన్నారు.

సమైక్యాంధ్రే తమ నినాదం అని ఊరూరా తిరిగిన వ్యక్తి షర్మిల అని ఈ సందర్భంగా కడియం గుర్తు చేశారు. అంతేకాదు.. పార్లమెంటులో జగన్ ప్లకార్డు పట్టుకుని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలను కూడా శ్రీహరి ప్రస్తావించారు. ఇక‌, రాజ‌కీయంగా ష‌ర్మిల‌కు అన్యాయం జ‌రిగింద‌న్నారు. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల, విజయమ్మలు పాదయాత్రలు చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని తెలిపారు.

అయితే, వారి క‌ష్టాన్ని మ‌రిచిపోయి.. తల్లీ, చెల్లికి జగన్ రాజకీయంగా అన్యాయం చేశారు. “మీకష్టంతో అధికారంలోకి వచ్చి మీకు అన్యాయం చేశారు. షర్మిల ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజలకు మొర పెట్టుకోవాలి. రేపో మాపో సీబీఐ కేసులోనో, వివేకానందరెడ్డి హత్య కేసులోనో వైఎస్ జగన్ జైలుకు పోతే షర్మిలకు సీఎం అయ్యే అవకాశం వస్తుంది. అనవసరంగా తెలంగాణలో తిరిగి సమయాన్ని వృధా చేసుకోకు. షర్మిలకు తెలంగాణలో తిరిగే నైతికత లేదు. ఏపీలో జగన్ గ్రాఫ్ పడిపోతోంది” అని క‌డియం వ్యాఖ్యానించారు.v