జోగ‌య్య వ‌ర్సెస్ గుడివాడ‌.. చివ‌ర‌కు తేలేదేంటి…?

రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డం స‌హ‌జమే. అయితే.. ఇప్పుడు వృద్ధ నాయ‌కుడు.. మాజీ ఎంపీ హ‌రిరామ‌జోగ‌య్య‌.. సిట్టింగ్ నేత కంటే కూడా ఎక్కువ‌గానే రియాక్ట్ అవుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న నిరాహార దీక్ష చేశారు. అదేస‌మ‌యంలో తాజాగా .. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలంటూ.. ఆయ‌న హైకోర్టు మెట్లు ఎక్కారు. సీఎంగా ప‌వ‌న్ చూస్తాన‌ని ఆయ‌న ప్ర‌తిజ్ఞ‌లు కూడా చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌కు కౌంట‌ర్లు కూడా విసురుతున్నారు.

ఇక‌, మంత్రి గుడివాడ కూడా త‌న‌దైన శైలిలో రివ‌ర్స్ ఎటాక్ చేస్తున్నారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య పోరు తీవ్ర‌స్థాయికి చేరింది. ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తున్న వైసీపీ మంత్రులు, నేత‌ల‌పై జోగయ్య ఆగ్ర‌హం .. ఆవేశం వెళ్ల‌గక్కుతున్నారు. అయితే.. ప‌వ‌న్ ఇలా చేయొచ్చా.. అని ప్ర‌తిగా వైసీపీ మంత్రి ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య లేఖ‌ల యుద్ధం సాగుతోంది. తాజాగా జోగ‌య్య‌ను ఇరుకున పెట్టేలా.. గుడివాడ కీల‌క ప్ర‌శ్న సంధించారు.

“కాపు నాయ‌కుడు, కాపునాడు వ్య‌వ‌స్థాప‌కుడు.. వంగ‌వీటి మోహ‌న్‌రంగాను హ‌త్య చేయించింది.. చంద్ర‌బాబే అని ప‌లు సంద‌ర్భాల్లో జోగ‌య్య చెప్పారు. మ‌రి ఇప్పుడు అలాంటి చంద్ర‌బాబుతో చేతులు క‌లిపేందుకు ఉవ్విళ్లూరుతున్న ప‌వ‌న్‌ను మీరు ఎలా స‌మ‌ర్థిస్తారు ?” అని జోగ‌య్య‌కు ప్ర‌శ్న సంధించారు. ఇది రాజ‌కీయంగా.. జోగ‌య్య‌ను ఇరుకున పెట్టే స‌న్నివేశం. గ‌తంలో ఆయ‌న అన్న‌మాట వాస్త‌వ‌మే.. కానీ, ఇప్పుడు ప‌వ‌న్ వెళ్లి చంద్ర‌బాబుతో క‌లిసేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ ప‌రిణామంతో.. గుడివాడ ల‌క్ష్యం.. స్ప‌ష్టంగా తెలుస్తోంది. కాపుల‌ను త‌మ వైపు తిప్పుకోవాల‌న్న జోగయ్య వ్యూహానికి ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చిన‌ట్టేన‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య ర‌గ‌డ ఎలా ఉన్న‌ప్పటికీ.. తాము ఎటు వైపు అడుగులు వేయాలి.. తాము ఏం చేయాల‌నే విష‌యంపై కాపులు నిర్ణ‌యం తీసుకునే ప‌రిస్థితి లేకుండా పోతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.