ఇకపై సర్కారు బళ్లలోనూ ఎల్ కేజీ, యూకేజీ

నర్సరీ, ఎల్ కేజీ….యూకేజీ….ఈ పదాల్లో ఉన్న కేజీల బరువుకు తగ్గట్లుగానే….వాటిని చదివించడానికి తల్లిదండ్రులకు కూడా కేజీల్లో డబ్బు ఖర్చవుతుంది. ప్రైవేటు స్కూళ్లలో నర్సరీ, కిండర్ గార్డెన్ చదవించడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు తలకు మించిన భారమే. అయినా, తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కొందరు తల్లిదండ్రులు అప్పు సప్పు చేసైనా సరే పిల్లలను నాణ్యమైన విద్య అందించాలని వేలకు వేలు పోసి ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. అంత తాహత, ఆర్థిక స్థోమత లేని వారు సర్కారు బడులలో తమ పిల్లలను చదివిస్తున్నారు. అటువంటి వారికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటివరకు కేవలం ప్రైవేటు స్కూళ్లకే పరిమితమైన ఎల్ కేజీ, యూకేజీ విద్యను ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లోనూ అందుబాటులోకి తేవాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. వచ్చే ఏడాది నుంచి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్ కేజీ, యూకేజీ విద్య ప్రవేశపెట్టాలని విద్యాశాఖకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు అనువైన కొత్త సిలబస్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

6 సంవత్సరాలలోపు పిల్లల కోసం ప్రీ ప్రైమరీ–1 (ఎల్‌కేజీ), ప్రీ ప్రైమరీ–2 (యూకెజీ) (పీపీ–1, పీపీ–2)లను ప్రాథమిక విద్య పరిధిలోకి తీసుకురావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కిండర్‌ గార్డెన్ (ఎల్‌కేజీ, యూకేజీ)పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారికి నాణ్యమైన విద్యనందించేందుకు పకడ్బందీ పాఠ్య ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఒకటో తరగతి నుంచి బోధించే పాఠ్యాంశాలకు పీపీ–1, పీపీ–2 పాఠ్యాంశాలకు మధ్య సారూప్యత ఉండాలని, పీపీ–1, పీపీ–2 విద్యార్థుల సంఖ్యకు తగ్గ సంఖ్యలో టీచర్లు ఉండాలని ఆదేశించారు. ప్రైమరీ స్కూళ్లకు సమీపంలోనే అంగన్‌వాడీ కేంద్రాలుండే అవకాశాలను పరిశీలించాలన్నారు.

వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు స్కూళ్లకు అక్రిడిటేషన్‌ విధానం, వాటి ఫీజులపై పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. ప్రతి ఏటా ప్రైవేటు స్కూళ్లలో తనిఖీలుండాలని, ఫిర్యాదులు స్వీకరించేందుకు కంప్లయింట్‌ బాక్స్‌ , ఒక యాప్‌ ఉండాలని సూచించారు. తాజా నిర్ణయంతో ప్రైవేటు స్కూళ్లకు జగన్ సర్కార్ షాకిచ్చినట్లయింది. మరోవైపు, కోవిడ్‌–19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబర్‌ 5 నుంచి రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభించాలని నిర్ణయించినట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం, జగనన్న గోరుముద్ద పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించబోతున్నట్లు వెల్లడించారు.