పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఓఎల్ఎక్స్

ఓఎల్ఎక్స్ ఆన్ లైన్ లో లొసుగుల ద్వారా కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఓ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే నేరుగా మీ ఎకౌంట్ లోకి డబ్బులు పడతాయంటూ వినియోగదారుల ఖాతా నుంచే డబ్బు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఎకౌంట్ లో డబ్బులు పడిన వెంటనే ఇంటికొచ్చి వస్తువు తీసుకెళ్తామని చెప్పడంతో నమ్మి మోసపోతున్నారు వినియోగదారులు. డబ్బులు పోయాక లబోదిబోమంటూ సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీంతో, సైబర్ నేరగాళ్ల ఆగడాలు పోలీసులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. ఈ తరహా నేరాలు సైబరాబాద్ పరిధిలో ఎక్కువ కావడంతో…పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గత ఏడాది సైబరాబాద్ పరిధిలో 3,838 మందిని రూ.13.35 కోట్ల మేర మోసగించారీ కేటుగాళ్లు. దీంతో, ఏకంగా ఓఎల్ ఎక్స్ ను నిషేధించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సైబర్ క్రైమ్ పోలీసులు లేఖ రాశారు. దీనిని ఓఎల్ఎక్స్ సైబర్ క్రైమ్స్ ఏ రేంజ్ లో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

సైబర్‌ నేరగాళ్లు ఓఎల్‌ఎక్స్‌ వేదికగా నగరవాసులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎల్‌Šఎక్స్‌ పేరిట వస్తున్న ప్రకటనల్లో 90 శాతం తప్పుడువని పోలీసులు హెచ్చరిస్తున్నా…చాలామంది మోసగాళ్ల వలలో పడుతున్నారు. అప్రమత్తంగా ఉండకుండా తప్పుడు ప్రకటనలు చూసి అమాయకులు నష్టపోతున్నారు. రూ.50 వేలు విలువచేసే బైక్ కొనాలనుకున్న వ్యక్తి నుంచి వేర్వేరు ఫీజుల పేరుతో రూ.2 లక్షలు కొల్లగొట్టారు సైబర్ కేటుగాళ్లు. తాము మిలటరీలో పనిచేస్తున్నామని, మిలటరీ కార్యాలయాల్లో ఉద్యోగలుమని నమ్మబలుకుతున్నారు మోసగాళ్లు. దీంతో, నమ్మి ఆన్ లైన్ లో వస్తువును చూసి డబ్బు పంపి మోసపోతున్నారు వినియోగదారులు.

గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో ఓఎల్ఎక్స్ మోసాలు రోజుకు 10కి పైగా నమోదవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ పరిథిలోనే గడిచిన ఐదేళ్లలో ఓఎల్ఎక్స్ లో వంద కోట్ల రూపాయల వరకు సైబర్ మోసాలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి మోసాలు పెద్ద సంఖ్యలో జరుగుతుండడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇటువంటి సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా…..ప్రజలు తీరు మారడం లేదని పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ఆన్ లైన్ వ్యవహారాలు కాకుండా వస్తువును వెళ్ళి స్వయంగా పరిశీలించుకోవడం వంటివి చేసుకుంటే మోసాలకు చెక్ పడుతుందని పోలీసులు చెబుతున్నారు. వస్తువు చూడకుండా ముందుగా విక్రయదారులకు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించవద్దని కోరుతున్నారు.

మరోవైపు, సైబర్ నేరాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఓఎల్‌ఎక్స్‌ వినియోగదారుల భద్రతకు సంబంధించి పలు కీలక చర్యలు చేపట్టింది. సైబర్‌ పీస్‌ ఫౌండేషన్ తో ఓఎల్‌ఎక్స్‌ భాగస్వామ్యం కుదుర్చుకొని సైబర్‌ భద్రతా అవగాహన సదస్సులను నిర్వహించనుంది. యూజర్ల భద్రత కోణంలో ఓఎల్‌ఎక్స్‌ యాప్‌లో సేఫ్టీ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టినట్టు సంస్థ ప్రకటించింది. స్పామ్, హానికారక కంటెంట్‌ గురించి రిపోర్ట్‌ చేయవచ్చని, ఆన్ లైన్ మోసాలను తమ దృష్టికి కూడా తీసుకురావాలని ఓఎల్ ఎక్స్ కోరుతుంది. మరి, టిక్ టాక్ పై నిషేధం విధించిన మాదిరిగానే ఓఎల్ ఎక్స్ పై కూడ కేంద్రం నిషేధం విధిస్తుందో లేదో వేచి చూడాలి