తెలుగు రాష్ట్రలకు ఒట్టి చేతులేనా..

వార్షిక బడ్జెట్ వచ్చేస్తోంది. మధ్య తరగతి వర్గాలకు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వర్గాలు అంటున్నాయి. బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే పద్దుల్లో ఆదాయపన్ను పరిమితిని గతంలోలాగే రెండున్నర లక్షలుగా కొనసాగిస్తూ, శ్లాబులను మాత్రం మార్చనున్నారని విశ్వసిస్తున్నారు.స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50 వేల నుంచి మరో 15 నుంచి 25 వేల వరకు పెంచే వీలుందని చెబుతున్నారు. సెక్షన్ 80సీ కింద ఇచ్చే రాయితీని లక్షన్నర నుంచి ఇంకాస్త పెంచబోతున్నారు.

పేద, గ్రామీణ వర్గాలకు ప్రోత్సాహకాలు
గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించే ప్రకటనలు ఉండొచ్చు. సామాజిక భద్రతా కార్యక్రమాలకు కూడా ఊతమివ్వనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు గ్రామీణ కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించనున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం లోక్ సభ ఎన్నికలకు వెళ్లే ముందు ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో పేద, మధ్య తరగతి వర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. పట్టణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలతో పాటు నష్టాల్లో ఉన్న స్టార్టప్‌లను ఆదుకుంటారని చెబుతున్నారు.

దెబ్బతిన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడేందుకు స్టాంప్ డ్యూటీ తగ్గించబోతున్నారు. ఇళ్ల తాకట్టుపై వడ్డీ రాయితీని రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచాలన్న డిమాండ్ పరిశీలించే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రలకు ఒట్టి చేతులేనా..

కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఈ సారి కూడా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని రెండు రాష్ట్రాల ఆర్థికవేత్తలంటున్నారు. ప్రత్యేక హోదాపై ఆశలు వదుకున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై కేంద్రం ఈ సారైనా స్పష్టత ఇస్తుందో లేదో చూడాలి. పేదల ఆహార భద్రత విషయంలో కేంద్రం శీతకన్నేసిందని ఏపీ ప్రభుత్వం వాపోతోంది. అదనంగా నెలకు 77 వేల టన్నుల రేషన్ బియ్యాన్ని కేటాయించాలని ఏపీ కోరుతోంది. విశాఖ మెట్రో రైలు ఈ సారి కూడా ఎండమావు కాకూడదని జనం ఎదురు చూస్తున్నారు. నత్తనడక నడుస్తున్న ప్రాజెక్టులకు ఆర్థిక వనరులివ్వాలని ఏపీ కోరుతోంది.

విభజన చట్టం హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఎదురు చూస్తోంది. గతేడాది ప్రస్తావించిన 35 డిమాండ్ల ఈ సారి కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. గిరిజన యూనివర్సిటీ, బయ్యారంలో ఉక్కు ప్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటిని ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్న ఆవేదన తెలంగాణ ప్రజల్లో ఉంది. అయితే తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు ఆశించిన మేరకు ఉండక పోవచ్చన్నది ఆర్ధిక నిపుణులు చెబుతున్న మాట.