నెల్లూరు రూరల్ ఇంఛార్జ్ గా ఆనం విజయ్ కుమార్ రెడ్డి ?

ఉమ్మడి నెల్లుూరు జిల్లా రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సింహపురిలో నాయకత్వాలు మారే అవకాశం కనిపిస్తోంది. ఎంత బుజ్జగించినా మాట వినని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఝలక్ ఇవ్వాలని జగన్ డిసైడైనట్లు సమాచారం.

వైసీపీ అధినాయకత్వంపై కోటంరెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని అనుచరుల వద్ద ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మూడు నెలలుగా తన ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని, అందుకే 12 సిమ్ లు మార్చానని చెప్పుకున్నారు. తన సోదరుడు గిరిధర్ రెడ్డిని తనకు పోటీగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఈ క్రమంలోనే కోటంరెడ్డి త్వరలో పార్టీ నుంచి వైదొలుగుతారన్న ప్రచారం ఊపందుకుంది. తనను కాదని కాకాని గోవర్థన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినప్పటి నుంచి కోటంరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

ఇంఛార్జ్ గా విజయ్ కుమార్

కోటంరెడ్డి తీరుతో వైసీపీ అధిష్టానం పునరాలోచనలో పడింది. ఆయనకు పోటీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఆనం విజయ్ కుమార్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇంఛార్జ్ గా నియమిస్తారని రాత్రికి రాత్రి ప్రచారం ప్రారంభించారు. ఆనం కుటుంబంలో రామ నారాయణ రెడ్డి సహా కొందరు నేతలు వైసీపీ దూరం జరుగుతున్నప్పటికీ విజయ్ కుమార్ రెడ్డి మాత్రం జగన్ తోనే ఉంటానని ప్రకటించారు. జనవరి రెండో వారంలో ఆయన ప్రత్యేకంగా వెళ్లి జగన్ ను కలిశారు.అప్పుడు ఆయన భార్య నెల్లూరు జడ్పీ చైర్మన్ అరుణమ్మ, కుమారుడు కార్తికేయరెడ్డితో వెంట ఉన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా ముందుకు కదులుతోందని కూడా విజయ్ కుమార్ స్టేట్ మెంట్ ఇచ్చారు.

ఆనం కుటుంబం మొత్తం వైసీపీని వీడుతోందన్న ప్రచారానికి తెరదించే ప్రక్రియగా విజయ్ కుమార్ రెడ్డి వెళ్లి జగన్ మోహ్మన్ రెడ్డిని కలిసినప్పటికీ ఇప్పుడది ఆయనకు ప్రయోజనకరంగా మారింది. సరిగ్గా కోటంరెడ్డి తిరుగుబాటు ప్రారంభమైన నేపత్యంలోనే విజయ్ వెళ్లి జగన్ ను కలిశారు. దానితో అధినేత దృష్టిలో పడిపోవడంతో కోటంరెడ్డిని దెబ్బకొట్టేందుకు విజయ్ ను ఇంఛార్జ్ గా పెడతారన్న ప్రచారం మొదలైంది..

అయితే ఏదీ ఫైనల్ కాలేదని, ఇప్పుడే ఏం చెప్పలేమని వైసీపీ వర్గాలు అంటున్నాయి..