‘భార‌తి పే’ పై ప్రశ్నల వర్షం

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అయ్య‌న్నాపాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ ను ఏపీ సీఐడీ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. సీఐడీ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి వ‌చ్చిన విజయ్ పై అధికారులు ప్ర‌శ్న‌ల వర్షం కురిపిస్తున్న‌ట్టు తెలిసింది. ‘‘భారతీ పే’’ యాప్ పోస్టు వ్యవహారంలో విజయ్‌కు సీఐడీ నోటీసులు ఇవ్వాగా… విచారణ నిమిత్తం ఆయన సీఐడీ కార్యాలయానికి వచ్చారు.

ఈ సంద‌ర్బంగా సీఐడీ అధికారులు ఆయ‌న‌ను అన్ని రూపాల్లోనూ ప్ర‌శ్నిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ భార‌తి పే యాప్‌ను ఎవ‌రు రూపొందించారు? దీని వెనుక ఎవరున్నారు? నారా లోకేష్‌తో ఉన్న సంబంధం ఏంటి? ఈ యాప్ ద్వారా సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణిని ఎందుకు టార్గెట్ చేశారు? ఇప్ప‌టి వ‌ర‌కు పెట్టిన పోస్టులు.. వాటిపై కామెంట్లు? ఇలా.. అన్ని రూపాల్లోనూ ఆయ‌న‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం అందింది.

ఇదిలావుంటే, గతేడాది సెప్టెంబరులో విజయ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ నెల 27న విచారణకు రావాల్సిందిగా విజయ్‌కు సీఆర్‌పీసీ 41ఏ కింద సీఐడీ నోటీసులు జారీ చేసింది. అయితే అదే రోజున వేరే కార్యక్రమాలు ఉండటంతో సీఐడీ విచారణకు హాజరుకాలేనని హైకోర్టులో చింతకాయల విజయ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 30న‌ సీఐడీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. లాయర్ సమక్షంలో విచారణ జరపాలని కోర్టు సూచించింది. కోర్టు సూచన మేరకు విజయ్ సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఎంపీకి లేని అడ్డంకి.. విజ‌య్‌కు!

మరోవైపు.. చింతకాయల విజయ్ వెంట మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనంద బాబు సీఐడీ కార్యాలయానికి వచ్చారు. అయితే మాజీ మంత్రులను పోలీసులు అడ్డుకున్నారు. లోనికి వెళ్లేందుకు వీలు లేదని తేల్చిచెప్పారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.అయితే.. ఇటీవ‌ల రెండు రోజుల కింద‌ట వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ అధికారులుహైద‌రాబాద్‌లో విచారించారు. ఈ సంద‌ర్భంగా వైసీపీకి చెందిన న‌లుగురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయ‌న వెంట వెళ్లారు. అప్ప‌ట్లో ఎవ‌రూ వీరికి అడ్డు చెప్ప‌లేదు. కానీ, ఈ రోజు మాత్రం టీడీపీనేత వెంట ఉన్న వారికి అడ్డు చెప్ప‌డం గ‌మ‌నార్హం.