రాహుల్ ను కలిసిన ఛోటా రాహుల్

మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు. అప్పుడప్పుడు అలాంటి వారిని చూస్తుంటాం. అయితే.. ఏదైనా రంగానికి చెందిన ప్రముఖులను పోలిన వారు చాలా తక్కువగా ఉంటారు. దగ్గర పోలికలు ఉండటం ఒక ఎత్తు. చూసేందుకు ఒకే మాదిరి ఉండటం మరో ఎత్తు. తాజాగా అలాంటి కాంబినేషన్ ఒకటి ఆవిష్క్రతమైంది. దీనికి జోడో యాత్ర వేదికగా మారింది.

కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరు.. గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీని పోలినట్లుగా ఉంటే ఛోటా రాహుల్ తాజాగా కలవటం.. ఇద్దరు చేతులు బిగించి ఫోటోలకు ఫోజులు ఇవ్వటం అందరిని ఆకర్షిస్తోంది. రాహుల్ గాంధీ యూత్ లో ఉంటే ఎలా ఉంటారన్న దానికి తగ్గట్లే.. ఛోటా రాహుల్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ ఛోటా రాహుల్ యువరైతుగా సుపరిచితుడు.

తన జీవితకాలంలో ఎప్పుడైనా ఒకసారి రాహుల్ గాంధీని కలవాలన్నది ఆయన ఆశ. అతడు ఉండే మేరఠ్ జిల్లా మవానా.. ఆ చుట్టుపక్కల వారంతా కూడా రాహుల్ పోలికలతో కనిపించే ఇతన్ని చూసి ఛోటా రాహుల్ గా పిలుస్తుంటారు. ఈ ఇమేజ్ తో అతని అసలు పేరైన మహమ్మద్ ఫైసల్ ఛౌదరి అన్న పేరును కూడా మర్చిపోతుంటారని చెబుతారు. ఛోటా రాహుల్ తండ్రి కాంగ్రెస్ కు వీరాభిమాని.

తండ్రి మరణంతో చదువుతున్న బీఏ కోర్సును మధ్యలో ఆపేసి.. వ్యవసాయం చేస్తున్న ఫైసల్.. భారత జోడో యాత్ర ఢిల్లీలో ఉన్న వేళలో రాహుల్ టీంతో కలిశారు. రాహుల్ ను కలిసి ఒక్క ఫోటో దిగాలన్న అతడి కోరిక ఎట్టకేలకు తీరింది. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. రాహుల్ వద్దకు వెళ్లాలన్న ఫైసల్ ఆత్రుతను గమనించిన రాహుల్.. అతన్ని తనకు దగ్గరగా పిలుచుకొని ఐదు నిమిషాలు మాట్లాడటమే కాదు.. కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో.. బడా రాహుల్ ను ఛోటా రాహుల్ కలిశారన్న మాట ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది.