నేనేమైనా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనా? : కోటంరెడ్డి

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని.. త‌నపై పోలీసులు, ఇంటెలిజెన్స్ వ‌ర్గాలునిఘా పెట్టాయ‌ని.. ఆయ‌న ఆరోపించారు. అంతేకాదు.. అధికారుల తీరు దారుణంగా ఉంద‌న్నారు. పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారుల తీరుపై కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

“నేనేమైనా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనా?.. నా దగ్గర 12 సిమ్ కార్డులు ఉన్నాయి. టెలిగ్రామ్, వాట్సాప్ కాల్స్‌లో మాట్లాడితే ఏం చేయగలరు?.. ఏపీ పోలీసు బాసు కూడా నన్ను ఏమీ చేయలేరు. 35ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా… ఎప్పుడు ఏం చేయాలో తెలుసు” అని హెచ్చరించే ధోరణిలో కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.

త‌న ఫోన్‌ను ట్యాప్ చేశార‌ని, ఇలా చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని అన్నారు. కాగా, గ‌తంలోనూ పార్టీపై ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తన నియోజకవర్గంలో మురుగునీటి కాలువ సమస్యపై ఒక‌సారి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేపట్టిన నిరసన కార్యక్రమం ఒక్కసారిగా సంచ‌ల‌నం రేపింది. నేరుగా ఆయ‌న ఒక మురుగునీటి కాలువ‌లో కూర్చుని.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అన్నీ ఇలానే ఉన్నాయంటూ నిర‌స‌న తెలిపారు. క‌లెక్ట‌ర్ వ‌చ్చి స‌మాధానం చెప్పే వ‌ర‌కు కూడా తాను మురుగునీటి కుంట‌లోంచి లేచేది లేద‌న్నారు.

ఇక‌, ఇటీవల తన నియోజకవర్గంలో పింఛన్ల కోతపై బాహాటంగానే విరుచుకుపడ్డారు. పింఛ‌న్లు కోత పెట్ట‌డం అనేది ఎక్క‌డా లేద‌న్నారు. గ‌తంలో వైఎస్ హ‌యాంలో పింఛ‌న్లు పొందిన వారు ఉన్నార‌ని.. ఇప్పుడు తీసేసే వారు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు, సొంత పార్టీ వైసీపీకి చెందిన నాయకులే తనను బలహీన పరచడానికి కుట్ర పన్నుతున్నారని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క పోవ‌డంపైనా ఆయ‌న తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మొత్తంగా చూస్తే.. కోటంరెడ్డి ప‌రిస్థితి క‌క్క‌లేక మింగ‌లేక అన్న‌ట్టుగా త‌యారైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.