తారకరత్న విషయంలో ఏం జరిగింది? వైద్యులు ఏం చెబుతున్నారు?

అప్పటిదాకా బాగానే ఉంటారు. అంతలోనే అనారోగ్యం బారిన పడతారు. ఆ వెంటనే ప్రాణాలు పోయేంత అపాయం చెంతకు చేరుతారు. ఇటీవల కాలంలో తరచూ వింటున్న.. చూస్తున్న షాకింగ్ ఉదంతాలు ఏం చెబుతున్నాయి? అన్నది అసలు ప్రశ్న. తాజాగా తారక రత్న విషయంలోనూ అదే జరిగింది. నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు తన సంఘీభావాన్ని తెలుపుతూ కుప్పం చేరుకున్న తారకరత్న.. అప్పటివరకు హుషారుగా ఉంటూనే ఒక్కసారి కుప్పకూలటం తెలిసిందే.

అలా ఎలా జరుగుతుంది? ఒక్కసారిగా అలా జరిగిపోతుందా? అన్న సందేహాన్ని కొందరు వైద్యులతో మాట్లాడినప్పుడు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. తారకరత్న విషయానికే వస్తే.. ఉదయం లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయం వద్దకు చేరుకున్న తారకరత్నను చూసేందుకు.. అతడితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. అప్పుడే ఆయన కాస్తంత అసౌకర్యానికి గురయ్యారు. ఆ తర్వాత లక్ష్మీపురంలోని మసీదు వద్దకు వెళ్లినప్పుడు కూడా తారకరత్న అసౌకర్యానికి గురయ్యారు. పాదయాత్ర మొదలు కావటానికి కాస్తంత ముందుగా.. సుమారు మధ్యాహ్నం 12 గంటల వేళలో ఒక్కసారిగా కుప్పకూలారు.

ఈ వరుస క్రమాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఉదయం గుడికి వెళ్లిన సమయం నుంచి అనీజీగా ఉండటం.. అసౌకర్యానికి గురి కావటం కనిపిస్తుంది. అంటే.. శరీరం ఇచ్చే సంకేతాల్ని తారకరత్న అర్థం చేసుకునే విషయంలో పొరపాటు పడి ఉండాలి. లేదంటే.. పట్టించుకోకుండా ఉండాలి. అలా గుర్తించటం ఎలా సాధ్యమవుతుందన్న మాట చాలామంది నోటి నుంచి వస్తుంటుంది. జాగ్రత్తగా గమనిస్తే అర్థమయ్యే విషయం ఏమంటే.. శరీరంలోని ఏ బాగమైనా సరే.. రోజువారీకి భిన్నంగా ఉండి ఉంటే.. కాస్తంత ఆలోచించాల్సిన అవసరం ఉంది.

కరోనా తర్వాత ఈ తరహా సడన్ గుండెపోట్లు ఎక్కువ అయ్యాయి. దీనికి కారణం ఫలానా అన్న విషయాన్ని ఎవరూ చెప్పటం లేదు. కొందరు చేస్తున్న ప్రచారాలకు శాస్త్రీయత లేదు. అలాంటి వేళలో.. మనకున్న ఏకైక మార్గం జాగ్రత్తగా ఉండటం. అలా అని అనవసరమైన ఆందోళనలు కూడా సరికాదు. అంటే.. మరీ ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందకుండా.. అలా అని అవసరానికి స్పందించకుండా ఉండకుండా.. బాడీ చెప్పే మాటను ఎప్పటికప్పుడు వినాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఆరోగ్యంగా ఉండే వీలుంది.

తారకరత్న విషయానికే వస్తే.. ఆయన్ను చూసినప్పుడు ఇట్టే అర్థమయ్యే విషయం ఏమంటే.. శుక్రవారం ఉదయం నుంచి అతడు అసౌకర్యంగా ఉన్నారు. అలాంటి వేళలో మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ.. పట్టించుకోకపోవటం పెద్ద సమస్యకు దారి తీసింది. మనిషి ప్రాణానికి ముప్పుగా వాటిల్లే ముఖ్యమైన రెండు శరీర భాగాల్లో ఒకటి మొదడు అయితే రెడోది గుండె. ఈ రెండింటి విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా.. ఆ సందేశాల్ని శరీరం వెంటనే చెప్పేస్తుంది. అయితే.. ఆ సందర్భంగా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఎవరికి వారుగా ఉండాలి.

ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. కొంతమంది గుండె పట్టేసిందంటారు. కానీ.. అది గ్యాస్ (అజీర్ణం) కారణంగా వచ్చేదైతే.. ఛాతీ పట్టేసినట్లు ఉంటుంది. దానికి గుండెనొప్పికి తేడా ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. దీనికి సులువైన మార్గం ఒకటి ఉంది. సైంటిఫిక్ గా కాకుండా ఎవరికి వారు తమకు తాముగా తమ శరీరాన్ని ట్రాక్ చేసే పద్దతి ఒకటుంది. అదేమంటే.. ఏదైనా అసౌకర్యం చోటు చేసుకుంటే.. గడిచిన 24 గంటల్లో తీసుకున్న ఆహారం ఏమిటన్న దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సమాధానం వస్తుంది. తిన్న ఆహారంలో ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. శరీరంలోని ఏదైనా అవయువం ఇబ్బంది పడుతుంటే.. వెంటనే వైద్య సలహా తీసుకోవటం అవసరం.

మొత్తంగా చూసినప్పుడు.. శరీరం పంపే సంకేతాల్ని జాగ్రత్తగా గుర్తించటం.. అది చెప్పే మాటల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది జరిగితే.. చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యే వీలు ఉంటుంది. అనుకోని రీతిలో అపాయాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నది మర్చిపోకూడదు. అందుకే.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.