షర్మిలకు ఏమైంది? జోరు తగ్గింది.. పదును మిస్ అయ్యిందే?

అవకాశాలు ఉన్న చోట ప్రయత్నం చేయటం ద్వారా.. చాన్సుల్ని సొంతం చేసుకునే వీలు ఉంటుంది. అలాంటిది అవకాశం అన్న మాటకు కూడా ఛాన్స్ లేని చోట వచ్చి.. రాజకీయం చేస్తున్న వైఎస్ షర్మిల తీరును కొందరు గొప్పగా అభివర్ణిస్తే.. మరికొందరు ఆమెను తీవ్రంగా తప్పు పడుతుంటారు. అయితే.. తన మీద విమర్శల్ని చేసేవారిని అస్సలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయే అలవాటున్న ఆమె..గడిచిన కొంతకాలంగా తన తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న మాట వినిపిస్తోంది.

చుట్టూ కమ్మేసిన ప్రతికూలతల్ని సైతం తట్టుకొని ధైర్యంగా వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆమె.. నిత్యం తెలంగాణ తండ్రీకొడుకులుగా గుర్తింపు పొందిన కేసీఆర్.. కేటీఆర్ లపై ఘాటుగా విరుచుకుపడటం.. సూటిగా.. సుత్తి లేకుండా ఫైర్ కావటం తెలిసిందే. పాదయాత్రలో ఆమె చేసే వ్యాఖ్యలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తొందరపడి షర్మిలను ఒక మాట అనే సాహసం చేయకపోవటం తెలిసిందే.

అయితే.. ఆ మధ్యన షర్మిల నోటి నుంచి వచ్చే వ్యాఖ్యల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు.. పాదయాత్రతో తన చేతలకు పని చెప్పే ఆమె జోరుకు కళ్లాలు వేసేందుకు పాదయాత్రను శాంతిభద్రతల పేరు చెప్పి అడ్డుకున్నారని.. ఆమెను అదుపులోకి తీసుకున్నారన్న విమర్శ గురించి తెలిసిందే. ఈ సందర్భంగా సాగిన ఎపిసోడ్.. అందులో కేసీఆర్ సర్కారు ఇరుకున పడేలా ఆమె వ్యవహరించిన తీరు పలువురి మనసుల్ని దోచింది. అన్నింటిక మించి తనకు తాను కారును డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న వేళ.. షర్మిలను పోలీసులు అడ్డుకోవటం.. కారులో నుంచి దిగాలని చెప్పగా.. అందుకు ససేమిరా అనటం.. దీంతో టోయింగ్ వెహికిల్ తో ఆమె కారును లాక్కెళ్లిపోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ సందర్భంగా సాగిన ఎపిసోడ్ లో షర్మిల వ్యవహరించిన తీరు.. ఆమె పట్టుదల.. మొండితనం గురించి అప్పట్లో అందరూ మాట్లాడుకునేలా చేసింది. అయితే.. ఆ ఎపిసోడ్ అనంతరం ఆమె చేసే పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేయటం తెలిసిందే. త్వరలో మరోసారి ప్రజల మధ్యకు వెళ్లేలా షర్మిల తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఇటీవల కాలంలో షర్మిల జోరు తగ్గినట్లుగా వాదన వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో హడావుడి చేయకపోవటం ఏమిటన్న మాట వినిపిస్తోంది.

షర్మిలకు ఉన్న పట్టుదల.. దానికి మొండితనం అదనంగా చేరటం.. తాను ఏదైనా కోరుకుంటే దాన్ని సొంతం చేసుకునేందుకు ఎంత కష్టమైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించిన ఆమె .. గడిచిన కొంతకాలంగా కామ్ గా ఉంటున్నారు. ఎందుకిలా? అన్నది ప్రశ్నగా మారింది. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్.. కేటీఆర్ లను గురి చేయటం చాలా తేలికైనప్పటికీ.. ఆమె మాత్రం మౌనంగా ఉంటున్నారు. వ్యూహాత్మకంగానే మౌనంగా ఉంటున్నారా? లేదంటే సరైన టైం కోసం ఎదురచూస్తు.. వెయిట్ చేస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.