ఈ ఎంపీ కు జగన్ సపోర్ట్ తగ్గిందా?

బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ను ఇంతకాలం జగన్‌కు అత్యంత ప్రీతిపాత్రుడిగా భావించేవారు చాలామంది. ఆయన రాజకీయ ప్రత్యర్థులు, ఆయన అనుచరులు, వైసీపీలోని ఇతర నేతలు, చివరకు అధికారులు కూడా ఆయన జగన్‌కు అత్యంత ఇష్టుడని.. జగన్ నుంచి ఆయనకు ఫుల్ సపోర్ట్ ఉందని భావించేవారు. అందుకు తగ్గట్లుగానే నియోజకవర్గంలో.. సొంత జిల్లాలో ఆయన హవా నడిచింది. కానీ, గత కొన్నేళ్లుగా నందిగం సురేశ్‌ను ఇంటాబయటా అంతా లైట్‌గా తీసుకుంటున్నట్లు టాక్.

ముఖ్యంగా నిత్యం ఆయన వివాదాల్లో నిలుస్తుండడంతో జగన్ కూడా పెద్దగా ఎంటర్టైన్ చేయడం లేదన్న మాట వైసీసీ నుంచి వినిపిస్తోంది. నిజానికి నందిగం సురేశ్‌ ఎంపీగా టికెట్ తెచ్చుకోవడం నుంచి గెలవడం వరకు అంతా అదృష్టం మీద ఆధారపడిన విషయమంటారు ఆ పార్టీలో ఉన్నవారు. రాజధాని అమరావతి ప్రాంత మండలం మందడానికి చెందిన నందిగం సురేశ్. పెద్దగా చదువుకోనప్పటికీ చురుకైన వ్యక్తి. రాజదానికి భూముల సమీకరణ సమయంలో అమరావతి ప్రాంత గ్రామాల్లో పొలాలు, అరటి తోటలు తగలబడిపోవడం వంటివి జరిగాయి. ఆయా విషయాల్లో వైసీపీ తరఫున యాక్టివ్‌గా
పనిచేసిన సురేశ్ అప్పట్లో జగన్‌ను బాగా ఆకట్టుకున్నారు.

రాజధాని ప్రాంతంలో పెద్దసంఖ్యలో యూత్‌ను వెంటేసుకుని వైసీపీ కార్యక్రమాలు చేయడంతో ఎస్సీ రిజర్వ్‌డ్ బాపట్ల లోక్ సభ సీటుకు ఆయన్ను ఎంచుకున్నారు జగన్. దళితుడే అయినప్పటికీ క్రిస్టియన్ సంబంధాలుండడం… బాపట్ల ప్రాంతంలో క్రిస్టియానిటీ కూడా ఎక్కువగా ఉండడం ఆయనకు కలిసొచ్చింది.

అయితే, ఎంపీగా గెలిచిన తరువాత సురేశ్ వల్ల పార్టీకి ఏమీ ప్రయోజనం లేకపోయిందని జగన్ కూడా అనుకుంటున్నారని వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా ఎంపీగా ఆయన దిల్లీలో పార్లమెంటు సమావేశాలలో పాల్గొనేటప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన దళిత, క్రిస్టియన్ ఎంపీలతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడం.. జగన్ ఇమేజ్ పెరిగేలా, ఏపీ ఇమేజ్ పెరిగేలా ఇతర రాష్ట్రాల నేతల వద్ద సరైన ముద్ర వేయలేకపోయారని.. సభలోనూ ఆయన ముద్ర ఏమీ లేదని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

పైగా నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలోని ఎమ్మెల్యేలు కొందరితో సమన్వయం లేకపోవడం.. అలాగే, సురేశ్ అనుచరులు తరచూ ఏదో ఒక కేసుల్లో కనిపిస్తుండడం వంటివి జగన్‌కు నచ్చలేదని సమాచారం. ముఖ్యంగా ఏపీకి చెడ్డపేరు తెస్తున్న గంజాయి కేసుల్లో ఎంపీ సురేశ్ అనుచరుల పేర్లు ఒకట్రెండుసార్లు బయటకు రావడం జగన్‌కు కోపం తెప్పించిందట. సురేశ్ సొంత ఇమేజ్ పెంచుకునేలా తనపై సినిమా తీయించుకోవడం.. విలాసవంతమైన లైఫ్ స్టైల్ వంటివీ జగన్ దృష్టిలో ఉన్నట్లు సమాచారం.

ముఖ్యంగా వేల కోట్ల సంపద గల జగన్.. తాను సీఎం అయినప్పటికీ సాధారణంగా కనిపించే తెల్లచొక్కా, సాధారణ ప్యాంట్‌లో కనిపిస్తారు. అవి పెద్దపెద్ద బ్రాండ్ల దుస్తులే కావొచ్చు.. వేల రూపాయల విలువ చేయొచ్చు.. కానీ, సాధారణ ప్రజలు చూడగానే ఆడంబరంగా కనిపించవు. కానీ.. నందిగం సురేశ్ నిత్యం వజ్రాలు పొదిగిన వాచీలతో, ఖరీదైన బూట్లు వంటివి ధరిస్తూ.. భారీ కార్లలో హడావుడి చేస్తూ నియోజకవర్గంలో తిరుగుతుంటారని.. ఇది యూత్‌లో ఆయనకు క్రేజ్ పెంచినా గత ఎన్నికల్లో ఆయనకు ఓటేసిన పేద దళితులు, నిరుపేద దళిత క్రిస్టియన్లకు మాత్రం దూరం చేస్తోందని ఇంటెలిజెన్స్ నుంచి జగన్‌కు సమాచారం ఉందని చెప్తున్నారు.

దీంతో పాటు తన అనుచరులు చేసే చిల్లర గొడవల సమయంలో పోలీసులను ఇంటికి పిలిపించుకోవడం వంటివి సురేశ్ చేస్తుంటారు. గతంలో ఇలాగే పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదని ఓ యువకుడిని ఆపారు.. ఆ కానిస్టేబుల్‌ను సురేశ్ ఇంటికి పిలిపించుకుని ఆగ్రహించినట్లు చెప్తారు.

ఓవరాల్‌గా నందిగం సురేశ్‌కు తాను ఇచ్చిన అవకాశాన్ని ఆయన వినియోగించుకోలేదని.. ఎంపీని చేసినా ఎంపీ స్థాయిలో ఆయన వ్యవహారం ఉండడం లేదని జగన్ అభిప్రాయపడుతున్నారట. ఈ విషయం అర్థమైన వైసీపీ నేతలు సురేశ్‌ను లైట్‌గా తీసుకుంటుండడంతో అధికారులూ ఆయనకు ఇవ్వాల్సినంత ప్రయారిటీ మాత్రమే ఇస్తున్నారట ఇప్పుడు. దీంతో సురేశ్ అధికారులపై కారాలు మిరియాలు నూరతుున్నట్లు సమాచారం. తాజాగా తనకు ప్రోటోకాల్ ప్రకారం మర్యాద ఇవ్వడం లేదంటూ ఆయన బాపట్ల కలెక్టర్‌పై ఆరోపణలు చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకలకు ఆహ్వానం అందలేదని.. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన అని నందిగం సురేశ్ అంటున్నారు. గతంలోనూ కొన్ని కార్యక్రమాలకు కలెక్టర్ పిలవలేదని సురేశ్ చెప్తున్నారు. ఈ విషయం జగన్‌కు ఫిర్యాదు చేస్తానంటున్నారాయన. మరి.. జగన్ ఆయన మాట వింటారా? లేదంటే ఆయన్నే తలంటుతారా చూడాలి.