టీడీపీ ఎన్టీఆర్ వ‌ర్సెస్ కొడాలి ఎన్టీఆర్‌

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ వర్థంతిని పుర‌స్క‌రించుకుని ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేత‌లు ఉత్సాహంగా కార్య‌క్ర‌మాలు చేసుకున్నారు. అయితే.. కొన్ని కొన్ని జిల్లాల్లో పోలీసులు ఉక్కుపాదం మోప‌డంతో కీల‌క నాయ‌కులు దూరంగా ఉన్నారు. ఇదిలావుంటే.. ఎన్టీఆర్ పుట్టిన గ‌డ్డ ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గుడివాడ‌లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ నేత‌ల మ‌ధ్య ర‌గ‌డ చోటు చేసుకుంది. దీనికి కార‌ణం.. వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని వ‌ర్గం కూడా ఎన్టీఆర్ వ‌ర్ధంతి పేరుతో హ‌ల్చ‌ల్ చేసింది.

మ‌రోవైపు.. టీడీపీ నాయ‌కులు కూడా ఎన్టీఆర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ‘టీడీపీ ఎన్టీఆర్ వ‌ర్సెస్ కొడాలి ఎన్టీఆర్‌’ వ‌ర్గాల మ‌ధ్య ర‌గ‌డ చోటు చేసుకుంది. ఇరు వ‌ర్గాలు తోపులాట‌ల‌కు.. వాగ్వాదాల‌కు దిగాయి. ఈ క్ర‌మంలో టీడీపీ కార్యకర్తలపై కొడాలి నాని అనుచరులు దాడి చేశారు. దాడిలో టీడీపీ కార్యకర్త చెల్లుబోయిన అనిల్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఓవైపు కంటి పక్కన గాయమై రక్తస్రావం జరుగుతున్నా, పోలీసులు మాత్రం అనిల్‌నే బెదిరించారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏం జ‌రిగిందంటే..

గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని టీడీపీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. టీడీపీ నేత వేనిగండ్ల రాము ఆధ్వర్యంలో పదివేల మందికి అన్న సంతర్పణ, అన్నా క్యాంటీన్ వాహనాలను ప్రారంభం చేశారు. అనంతరం భారీ ఎత్తున వర్ధంతి ర్యాలీని నిర్వహించారు. తొలుత‌ వేనిగండ్ల రాము, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.

మరోపక్క ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ‘ఎన్టీఆర్ ఫ్యాన్స్’ పేరుతో కొడాలి నాని అనుచ‌రులు చేపట్టిన బైక్ ర్యాలీని టీడీపీ నాయ‌క‌లు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర దాడి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో బైక్ ర్యాలీని నిర్వహించటంలో తప్పు ఏముందని వైసీపీ నేత‌లు ప్రశ్నించారు. అనంతరం హారన్లు మోగిస్తూ, జై కొడాలి నాని అంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కొడాలి అనుచరులకు పోలీసులు చెప్పినా వినలేదని, కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళుతున్న టీడీపీ కార్యకర్త చెల్లుబోయిన అనిల్‌పై నాని అనుచరులు దాడి చేశారని పోలీసులకు తెలియజేశారు. మొత్తానికి గుడివాడ‌లో చోటు చేసుకున్న తాజా ఘ‌ట‌న‌తో పోలీసులు 144 సెక్ష‌న్ విధించారు.