కేసీఆర్ వర్సెస్ టీమ్ఇండియా

కేసీఆర్ ఖమ్మం సభకు కొత్త కష్టమొచ్చింది. ఇప్పటికే ఖమ్మంలో సొంత పార్టీలో అసమ్మతి కారణంగా సభ అనుకున్న స్థాయిలో జరుగుతుందా లేదా అన్న అనుమానాలతో ఇతర జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలను తరలించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. కానీ, ఆ ప్లాన్లకు టీమ్ ఇండియా నుంచి ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కేసీఆర్ ఖమ్మంలో 5 లక్షల మందితో సభ తలపెట్టిన రోజునే హైదరాబాద్‌లో ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే క్రికెట్ మ్యాచ్ ఉంది. ఈ రెండు దేశాల మధ్య సిరీస్‌లో మొదటి మ్యాచ్ ఇది. ఇప్పటికే శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో టీమ్ ఇండియా బ్యాట్స్‌మన్ చెలరేగి ఆడారు. కోహ్లీ రెండు సెంచరీలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా టీ20లో సెంచరీ చేశాడు. శుభమన్ గిల్ కూడా సెంచరీ బాదాడు. ఓవరాల్‌గా టీమ్ ఇండియా శ్రీలంకపై దూకుడు చూపింది. భారీ స్కోర్లు సాధించింది.. కోహ్లీ సచిన్ రికార్డులు బ్రేక్ చేశాడు. ఈ నేపథ్యంతో హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌పై అభిమానులు విపరీతమైన ఆసక్తితో ఉన్నారు.

ఇది చాలదన్నట్లు టీమ్ఇండియా క్రికెటర్లు జూనియర్ ఎన్టీఆర్‌తో ఫొటోలు దిగడంతో ఆయన అభిమానులూ ఈ మ్యాచ్‌పై ఇష్టం పెంచుకున్నారు. మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 50 వేలకు పైనే ఉంటుంది. ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. స్టేడియంలోనే కాకుండా ఇళ్లలో టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ చూసేవారు, ఆ అవకాశం లేకపోతే ఫోన్లో మ్యాచ్ చూసేవారు కోట్లలో ఉంటారు.

మ్యాచ్ మధ్యాహ్నం 1.30కి మొదలవుతుంది.. పూర్తయ్యే సరికి రాత్రి 8.30 అవుతుంది. వాతావరణం చాలా క్లియర్‌గా ఉంది.. వర్షం పడే అవకాశాలు ఏమాత్రం లేవు. మ్యాచ్ జరిగి తీరడం ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ సభ సాయంత్రం 4 గంటలకు అంటున్నారు.

రాజకీయ సభ కాబట్టి ఇది ఆలస్యం కావొచ్చు.. సాయంత్రం 6 గంటలకు అనుకుందాం. ఇండియా మొదట బ్యాటింగ్ చేస్తే ఆ సరికి ఇన్నింగ్స్ పూర్తయిపోతుంది.. ఒకవేళ ఇండియా సెకండ్ బ్యాటింగ్ కనుక ఉంటే కేసీఆర్ సభకు మరింత నష్టం తప్పదు. కోట్లాది మంది కాన్సంట్రేషన్ క్రికెట్‌పైనే ఉండనుంది.

ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ అంటే యువత ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తారు. ఖమ్మం బీఆర్ఎస్ సభలో కేసీఆర్ తాను బీఆర్ఎస్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నాను… రాజకీయ ఉద్దేశాలు, లక్ష్యాలు, దేశ అవసరాలు అన్నీ చర్చించనున్నారు. కానీ, క్రికెట్ మ్యాచ్ కారణంగా కేసీఆర్ సభ రీచ్ భారీగా పడిపోనుంది.

పోనీ మరుసటి రోజు పేపర్లలో అయినా చదువుతారు అనుకుంటే ఓకే. కానీ.. ఇండియా ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తే కనుక మరుసటి రోజు పేపర్లలోనూ కేసీఆర్ కవరేజ్‌తో సమానంగా క్రికెట్ కవరేజ్ కూడా ఉండనుంది.

ఏ రకంగా చూసినా ఖమ్మం సభకు క్రికెట్ మ్యాచ్ భారీగానే దెబ్బకొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతల్లోనూ ఈ ఆందోళన కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా వరకు జనాలు వచ్చినా ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి రావాల్సిన వారు డుమ్మా కొడతారని.. ఇళ్లలో టీవీల్లో చూసేవారు కూడా కేసీఆర్ సభ కంటే క్రికెట్‌కు ప్రయారిటీ ఇస్తారని స్వయంగా క్రికెట్ అభిమానులైన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.