కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీకి దూరమైనట్లేనా ?

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. వీర్రాజు ఎవరినీ కలుపుకుపోవడం లేదని, ఆయనతో ఉన్న నలుగురైదుగురు నేతలను మాత్రమే సంప్రదిస్తున్నారని కన్నా చాలా రోజులుగా ఆగ్రహం చెందుతున్నారు. పైగా కన్నా నియమించిన జిల్లా అధ్యక్షుల్లో 8 మందిని సోము వీర్రాజు మార్చేశారు. వీర్రాజు వర్గం ప్లాన్ ప్రకారం పార్టీని హైజాక్ చేస్తున్నారని కన్నా వర్గం బహిరంగ ఆరోపణలకు దిగింది. తొలుత వీర్రాజు వర్గం సమాధానం చెప్పలేదు తర్వాతి కాలంలో పుండు మీద కారం చల్లినట్లుగా ఎదురుదాడి ప్రారంభించింది.

కార్యవర్గ భేటీకి దూరం

ఢిల్లీ నుంచి పార్టీ ఇంఛార్జ్ శివప్రకాష్ ఫోన్ చేసి బుజ్జగించినా కన్నా బెట్టు వీడలేదు. జగన్‌ బీఆర్‌ఎస్ తో దోస్తీ చేస్తున్నారని, అక్కడ బండి సంజయ్ ను, ఇక్కడ కాపులను టార్గెట్ చేస్తున్నారని, తద్వారా పవన్‌ కళ్యాణ్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే తామంతా పవన్‌ కు అండగా ఉంటామని కన్నా నేరుగా శివప్రకాష్ తోనే చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రావాల్సిందిగా కన్నాకు ఆహ్వానం అందింది. తనను మాత్రమే పిలిచారని భావించిన వీర్రాజుకు ఇదో పెద్ద షాక్ గా పరిణమించిందనే చెప్పాలి..కన్నాకు ఇన్విటేషన్ ఎలా వచ్చిందని ఆరా తీయడం మొదలు పెట్టారు.

తిరుమల వెళ్లిన కన్నా

కన్నా లక్ష్మీ నారాయణ ఢిల్లీ వెళ్లలేదు. ముందే తిరుమల ప్రయాణం పెట్టుకున్నానని అందుకే కార్యవర్గ సమావేశానికి రాలేకపోతున్నానని హస్తిన పెద్దలకు లేఖ పంపారు. కుటుంబ సభ్యులతో వెళ్లాలని నిర్ణయించుకున్నందున ఈ సారికి రాలేనని ప్రకటించారు. దానితో ఇప్పుడు కన్నా తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన బీజేపీని వదిలి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలను మెరుగు పరుచుకునేందుకు జనసేనలో చేరాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు..