సంక్రాంతిని బాగా వాడుకున్న కేసీఆర్’

తెలంగాణలో ఒక కాలు, ఆంధ్రలో మరో కాలు పెట్టి రాజకీయం చేస్తున్న కేసీఆర్‌ను ఏపీలోని ప్రధాన పార్టీలు ఎలా తీసుకుంటున్నాయో ఏమో కానీ కేసీఆర్ మాత్రం చాప కింద నీరులా పని సాగిస్తోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వాడుకోవాలని చూస్తోంది. తాజాగా సంక్రాంతి పండుగను కేసీఆర్ బీఆర్ఎస్ వర్గాలు ఫుల్‌గా వాడుకున్నాయి.

ముఖ్యంగా గోదావరి జిల్లాలలో సంక్రాంతి పండుగ సంబరాలంటే కోడి పందేలు, ఎడ్ల పందేలు వంటివన్నీ వేరే లెవెల్లో జరుగుతాయి. సరిగ్గా ఇదే అవకాశాన్ని ఉపయోగించుకుంది బీఆర్ఎస్. దేశవిదేశాల్లో స్థిరపడిన ఏపీ ప్రజలే కాదు, వారితో స్నేహం ఉన్న ఇతర రాష్ట్రాల వారు, తెలంగాణ వారు కూడా గోదావరి జిల్లాలలో కోడిపందేలకు వెళ్తారు.

ఈ సందర్భంగా ఏపీలోని పార్టీలతో పాటు బీఆర్ఎస్ ప్రజెన్ష్ కూడా కనిపించేలా ప్లాన్ చేశారు ఆ పార్టీ నేతలు. అందులో భాగంగా గోదావరి జిల్లాల్లో పట్టణాలు, పల్లెల్లో రోడ్ల వెంబడి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెద్దసంఖ్యలో కనిపించాయి. కోడి పందేల బరుల దగ్గర కూడా బీఆర్ఎస్ కనిపించింది, వినిపించింది.

ఏపీలోని గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు పెద్దసంఖ్యలో కనిపించాయి. హైవేల వెంబడే కాకుండా గ్రామాల్లోనూ కనిపించాయి. బీఆర్ఎస్ తరఫున ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఇవి వెలిశాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ ఈ ధోరణి కనిపించింది. ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కనిపించాయి.

దీంతో పాటు బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ అనుకూల పారిశ్రామికవేత్తలు, వ్యాపారలుు.. తెలంగాణలో ఉన్నతోద్యోగాలలో ఉన్న ఏపీకి చెందినవారు చాలామంది ఏపీలో తమకు పరిచయం ఉన్న వారి ఇళ్లకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానికులను కలవడం.. పార్టీ ఏపీపై ఇంట్రెస్టుగా ఉందన్న సంకేతాలు ఇవ్వడంతో పాటు టికెట్లు ఆశిస్తున్నవారితో ప్రత్యేక భేటీలు వంటివీ పెద్దఎత్తున జరిగాయి.

మొత్తానికైతే ఈ సంక్రాంతిని బీఆర్ఎస్ ఫుల్ లెవల్లో ఉపయోగించుకుంది. ఏపీ రాజకీయ పార్టీలతో విసిగిపోయిన న్యూట్రల్ ప్రజల మనసుల్లో సాఫ్ట్‌‌గా స్థానం సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది.