హైద‌రాబాద్ బోణీ … క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ షురూ

దేశ‌వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా కూడా కరోనా వైరస్‌తో పోరాడుతోంది. ఇప్పుడు అంద‌రి చూపు క‌రోనా వ్యాక్సిన్‌పైనే. ఈ క్రమంలోనే ఈ మహమ్మారిని అరిక‌ట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి తేవ‌డంలో భాగంగా అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. స్వదేశీ కరోనా వ్యాక్సిన్‌ కొవాగ్జిన్‌ను భారత్‌ బయోటెక్‌ రూపొందించిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను వైద్యులు ప్రారంభించారు.

ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్‌ను రూపొందించింది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్‌ కోవాక్సిన్‌ను ఆగస్టు15 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఎయిమ్స్ సహా దేశంలోని 13 ఆస్పత్రులలో హ్యూమన్‌ ట్రయల్స్‌ను వేగవంతం చేయనున్నారు. హైదరాబాద్‌లో నిమ్స్‌లో ఈ పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్‌` వ్యాక్సిన్‌పై మొదటి, రెండో క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపేందుకు ఇండియన్‌ డ్రగ్‌ రెగ్యులేటరీ అనుమతులు ఇచ్చి నిమ్స్‌లో ట్ర‌య‌ల్స్ మొద‌లుపెట్టిన ఐసీఎంఆర్ ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ ను సిద్ధం చేయాలని భావిస్తోంది.

మ‌రోవైపు, ఇప్పటికే కొన్ని ప్రధాన ఆసుపత్రిలలో హ్యూమన్‌ ‌ట్రయిల్స్‌ ప్రారంభం కాగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సంస్థ ఆల్ ఇండియా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు కూడా ఎథిక్స్ అనుమతి లభించింది. హ్యుమ‌న్ ట్ర‌య‌ల్స్‌లో భాగంగా వాలంటరీ ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నామని, సంబంధిత వాలంటీర్ల ఆరోగ్య పరీక్షలను ప్రారంభించామనీ ఎయిమ్స్ సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ వెల్లడించారు.