తమిళనాడు నాడార్లు బీఆర్ఎస్ వైపు ఎందుకు చూస్తున్నారు !

బీఆర్ఎస్ విస్తరణ చర్యలు వేగం పుంజుకున్నాయి. కొందరు ఏపీ నేతలను బీఆర్ఎస్లోకి చేర్చుకున్న తర్వాత కేసీఆర్ వేగం పెంచారు. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత ఇప్పుడాయన తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే నాడార్ సామాజిక వర్గం నేతలు వచ్చి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిశారు. తమిళనాడులోని నాడార్ సంఘాలు బీఆర్ఎస్ నాయకత్వంలో పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు..

తెలుగు రాష్ట్రాల్లో గౌడ, ఈడిగ కులాలకు సమానమైన సామాజిక వర్గం నాడార్లు . నాడార్లు కల్లు గీత కార్మికులు కూడా. అయితే నాడార్లలో చాలా మంది వ్యాపారాలు చేసి వేల కోట్లు ఆర్జించారు. తమిళనాడులోని ప్రతీ వీధిలోనూ ఒక నాడార్ వ్యాపారి చిల్లర కొట్టు పెట్టుకుని జీవిస్తుంటాడు, జనం వారిని అణ్ణాచి( అంటే అన్నయ్య) అని పిలుస్తుంటారు. వ్యాపారాల్లో రాణించినప్పటికీ రాజకీయంగా వెనుకబడిపోయామన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. పార్టీలు తమ నిధులు తీసుకుని, తమను రాజకీయంగా ఎదగనివ్వడం లేదని నాడార్లు చాలా కాలంగా ఆందోళన చెందుతున్నారు. పైగా నాడార్లలో వ్యాపారం చేసుకునే వాళ్లు మినహా మిగతా వాళ్లంతా పేదరికంలో ముగ్గుతున్నారు…

నిజానికి ఒకప్పుడు రాజకీయాల్లో నాడార్లు ఒక వెలుగు వెలిగారు. కామరాజ్ నాడార్ ముఖ్యమంత్రిగానూ, కాంగ్రెస్ అధ్యక్షుడిగాను పనిచేశారు. అత్యధిక కాపీలు విక్రయించే దిన తంతి పత్రిక వ్యవస్థాపడుకు శివంతి ఆదిత్యన్ కూడా నాడారే. ఆయన ఎంపీగా చేశారు. తర్వాతి కాలంలో నాడార్లు బాగా వెనుకబడిపోయినప్పటికీ ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో ముగ్గురు నాడార్ మంత్రులున్నారు. తమ వారికి సీఎం స్టాలిన్ ప్రాథాన్యం లేని పదవులు ఇస్తున్నారని, హోం, ఫైనాన్స్ లాంటి శాఖలను కట్టబెట్టడం లేదని నాడార్లు వాపోతున్నారు స్టాలిన్ సోదరి కనిమొళి… తండ్రి కరుణానిధికి రెండో భార్య కూతురు. కనిమొళి తల్లి రాజాతి అమ్మాళ్ నాడార్ సామాజిక వర్గానికి చెందిన మహిళ, ప్రస్తుత తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ కూడా నాడార్ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలే..

నాడార్లు ఒకప్పుడు ఎస్సీ సామాజికవర్గం లెక్కలో ఉండేవారు. తర్వాత వారు చాలా అభివృద్ధి చెందారన్న కాకి లెక్కలతో బీసీ జాబితాలోకి మార్చారు. దానితో ఎస్సీ స్టేటస్ కోసం వాళ్లు పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ తో కొందరు నాడార్ నేతల జత కట్టే ప్రయత్నం వెనుక ఎస్సీ రిజర్వేషన్ కోసం చేసే ప్రయత్నం ఉందని భావిస్తున్నారు. తెలంగాణలో లభించినట్లుగా కుల వృత్తులకు తమిళనాడులో ప్రోత్సాహం లభించడం లేదని నాడార్ సంఘాలు వాపోతున్నాయి. తెలంగాణలో గౌడ, ఈడిగ సామాజిక వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలువుతున్నాయని.. బీఆర్ఎస్ అధికారానికి వస్తే తమిళనాడులోనూ అలాంటి పథకాలే ప్రవేశ పెట్టాలని శ్రీవివాస్ గౌడ్ ను వారు అభ్యర్థించారు. త్వరలో కేసీఆర్ ఆప్పాయింట్ మెంట్ కోరి… పూర్తి వివరాలు ఆయనకు తెలియజేద్దామని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని శ్రీనివాస్ గౌడ్ వారికి హామి ఇచ్చారు. చూడాలి మరి…