దొంగగా మారిన ఏపీ కాంట్రాక్టర్

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చాక తమ పంట పండినట్లే అనుకున్నారు ఆ పార్టీ మద్దతుదారులైన కాంట్రాక్టర్లు. గతంలో వైఎస్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా.. కాంట్రాక్టర్లు మామూలుగా సంపాదించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ, వైఎస్ సన్నిహితులు అప్పట్లో ఎంతో బాగుపడ్డారు. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్ల ముఖాల్లో కళ పోయింది.

పెద్ద పెద్ద కాంట్రాక్టులు దక్కించుకున్న బడా బాబులకే ఢోకా లేకపోయింది కానీ.. చిన్న, మీడియం రేంజి కాంట్రాక్టర్ల పరిస్థితే దయనీయంగా మారింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టులు దక్కించుకుని.. చేతి నుంచి డబ్బులు పెట్టుకుని ఉత్సాహంగా పనులైతే చేసేశారు కానీ.. ఆ తర్వాత బిల్లుల కోసం నెలలు, ఏళ్లు ఎదురు చూస్తూ దయనీయమైన స్థితికి చేరుతున్నారు కాంట్రాక్టర్లు. 2019, 2020ల్లో చేసిన పనులకు కూడా బిల్లులు రాక ఇంకా ఇబ్బంది పడుతున్నవాళ్లున్నారు.

ఇలాగే ఒక కాంట్రాక్టర్ తాను చేసిన పనులకు ఏళ్ల తరబడి బిల్లులు రాక దొంగగా మారిన ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఒంగోలు జిల్లాకు చెందిన ఆ కాంట్రాక్టర్ పేరు క్రాంతి కిరణ్. ఆర్అండ్‌బీలో కాంట్రాక్టరుగా పని చేసే క్రాంతి కిరణ్.. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కాంట్రాక్టర్ అయ్యాడు. అతను చేసిన రూ.2.70 కోట్ల పనులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర బిల్లులు ఆగిపోయాయి. అవి ఎంతకీ రాకపోవడం అప్పులపాలయ్యాడు. అప్పులవాళ్ల గొడవ ఎక్కువైపోవడంతో ఏం చేయాలో పాలుపోక దొంగతనాన్ని మార్గంగా ఎంచుకున్నాడు.

తన మేనత్త ఇంట్లోనే అతను దొంగతనానికి పాల్పడడం గమనార్హం. ఒంగోలులోని దేవుడు చెరువు ప్రాంతంలోనే మేనత్త ఇంట్లో నాలుగు రోజుల కిందట రూ.52.5 లక్షలు దోచుకెళ్లాడు. ముందు ఎవరో బయటి వాళ్లే ఈ పని చేశారనుకున్నారు. కానీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి అందులో కనిపించిన ఒక కారు ఆధారంగా కూపీ లాగితే క్రాంతి కిరణే ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల దుస్థితికి ఈ ఉదంతం నిదర్శనం అంటూ జగన్ సర్కారును తూర్పారబడుతున్నారు నెటిజన్లు.