ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే మరో ప్రయత్నం

ఏపీలో అధికార వైసీపీకి ప్రజా వ్యతిరేకత తప్పడం లేదు. ఎమ్మెల్యేలను, మంత్రులను జనం ఎక్కడిక్కడ నిలదీస్తున్నారు. ఇదంతా తెలుగుదేశం చేయిస్తున్న పని అని వైసీపీ అనుమానిస్తోంది. దానితో విపక్షాన్ని డిఫెన్స్ లో పడేసేందుకు, రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు జగన్ పార్టీ తన దగ్గరున్న అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది.. ఈ మధ్య కాలంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కూడా వెనుకాడటం లేదు..

ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలి

ధర్మాస ప్రసాద రావుకు మంత్రి పదవి దక్కినప్పటి నుంచి ఆయన తెగ రెచ్చిపోతున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి మొత్తం తన మీదుగానే జరగాలన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ తన కల అన్నట్లుగా మాట్లాడుతున్నారు. విశాఖ రాజధాని రాకపోతే ఉత్తరాంధ్ర ప్రజలు ఊరుకోరని ఆయన చెబుతున్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు ధర్మాన ప్రయత్నిస్తున్నారు. విశాఖ రాజధాని ఇవ్వకుంటే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని ధర్మాన డిమాండ్ చేస్తున్నారు. అందుకు ఆయన పెద్ద రీజనే చెబుతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని, ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా అమరావతే ఏకైక రాజధాని అని నినాదాలిప్పించారని ధర్మాన గుర్తుచేస్తున్నారు….ఒకప్పుడు అమరావతికి మద్దతిచ్చిన ధర్మాన ఇప్పుడు మాత్రం జగన్ ఆలోచనా విధానాన్ని సమర్థించేందుకు విశాఖ రాజధాని నినాదాన్ని నెత్తికెత్తుకున్నారు…

మద్దతులేక ఇబ్బందులు

ఉత్తరాంధ్రలోనూ విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ప్రతిపాదనకు మద్దతు లభించడం లేదు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు లభించిన ప్రజా స్పందన అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తెలుగుదేశం అధినేత నిర్వహించిన రోడ్ షోలలో జనం కిక్కిరిసి కనిపించారు. ఆయన ప్రతీ డైలాగ్ కు కేరింతలు కొట్టారు. అమరావతి ప్రస్తావన వచ్చినప్పుడల్లా చప్పట్లతో తమ ఆమోదాన్ని తెలిపారు. దానితో వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదు. అనుకున్నదొక్కటీ, ఐనదొక్కటీ అన్నట్లుగా పరిస్థితి తయారైందని ఉత్తరాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు…

వాళ్లు బూతుల మంత్రులు

జగన్ తొలి మంత్రివర్గంలో ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. తర్వాత పునర్ వ్యవస్థీకరణలో సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు అవకాశం వచ్చింది. ఇద్దరికీ ఉత్తరాంధ్రలో బూతుల మంత్రులు అని పేరు ఉంది. పలు పర్యాయాలు కృష్ణదాస్, టీడీపీ నేతలపై చెప్పడానికి వీల్లేని బూతు పదజాలాన్ని ఉపయోగించారు. ఇప్పుడు ప్రసాదరావు కూడా అదే పని చేస్తున్నారు. ఒక్క పక్క ఉత్తరాంధ్ర అభివృద్ధికి పని చేస్తున్నామని అంటూనే ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తూ, బూతులు తిడుతూ టైమ్ పాస్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ధర్మాన బ్రదర్స్ అసహనానికి లోనవుతున్నారన్న ప్రచారమూ జరుగుతోంది….