ఇది.. వైసీపీ విధ్వంస నామ సంవ‌త్స‌రం: చంద్ర‌బాబు

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రతి ఏటా విధ్వంసాల సంవత్సరమేనని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ కోల్పోయి శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా క్షోభ అనుభవిస్తున్నారని అన్నారు. నెల్లూరు జిల్లా రాజుపాలెంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

‘2022కు వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం. జగన్ పాలనలో 2022 విధ్వంసాల సంవత్సరంగా మిగిలిపోయింది. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచీ ప్రతీ ఏడాదీ విధ్వంసాలే. ప్రభుత్వ విధ్వంసాల పనితనం ప్రజలు అనుభవించారు. ప్రతిపక్షంలో పలుమార్లు టీడీపీ ఉన్నా ప్రజలు ఎప్పుడూ ఇంతగా ఇబ్బందిపడలేదు. అందుకే జగన్‌ రెడ్డిని సైకో అనేది. మీడియా సహా వివిధ వ్యవస్థలపై దాడి చేసి పైశాచిక ఆనందం పొందాడు’ అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

‘సంపద సృష్టించే యువశక్తి రాష్ట్రంలో నిర్వీర్యమైపోయింది. నిరుద్యోగుల్లో నిరుత్సాహం, నిస్సహాయత నెలకొంది. విద్యా వ్యవస్థను నాశనం చేశారు. ఎక్కడా లేని పన్నులు రాష్ట్రంలోనే ఉన్నాయి. ప్రజలపై 40 రకాల పన్నులు మోపారు’ అని జగన్‌ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు.

‘దేశంలో ఎక్కడాలేని ధరలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతీరైతు మీద అప్పుంది. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. కౌలురైతు వ్యవస్థలో అగ్రస్థానంలో ఏపీ ఉండేది.. ఇప్పుడు కౌలు రైతులు కూడా పారిపోయారు. రాష్ట్రం గంజాయి హబ్‌గా మారి మహిళలకు రక్షణ లేకుండా పోయింది. గంజాయి, డ్రగ్స్‌ నివారణపై సీఎం శ్రద్ధ పెట్టట్లేదు. ఈ మూడున్నరేళ్లలో 53 వేల మందికిపైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి’ అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.