నిజం తెలుసుకుని మాట్లాడు జ‌గ‌న్ రెడ్డీ: చంద్ర‌బాబు వార్నింగ్‌

ఏపీ సీఎం Jagan కు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీ స‌భ‌లో జ‌రిగిన తొక్కిస‌లాట‌, మ‌ర‌ణాల‌పై సీఎం జ‌గ‌న్ న‌ర్సీప‌ట్నం స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనలో డ్రోన్ షో చేస్తున్నారని, అందుకే తొక్కిస‌లాట జ‌రిగి 8 మంది మ‌ర‌ణించార‌ని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబువి అన్నీ ‘షో’లేన‌ని విమ‌ర్శించారు.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు కౌంట‌ర్‌గా నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం’లో Chandrababu మాట్లాడారు. జ‌గ‌న్‌పై తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. “జగన్ రెడ్డీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నిజానిజాలు మాట్లాడు. ఇష్టమొచ్చినట్లు అవాకులు, చెవాకులు పేలితే.. తరిమికొడతాం” అని వార్నింగ్ ఇచ్చారు.

రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుకు ఐటీ అనే ఆయుధాన్ని తనిస్తే, భస్మాసుర హ‌స్తం.. సైకో సీఎం ఇస్తున్నాడని ఆరోపించారు. ఇంకా ఉపేక్షిస్తే పూర్తిగా నాశనం అవుతామని చంద్ర‌బాబు తెలిపారు. ప్రజలను ముఖ్యమంత్రి బానిసల్లాగా చూస్తున్నాడని ఆరోపించారు. నిత్యావసరల ధరలు, పన్నులు, ఇతర ఛార్జీలను సీఎం పెంచుతూనే ఉన్నారని విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ అన్స్థాపబుల్ అని.. రాష్ట్ర భవిష్యత్తు కోసం బుల్లెట్లా దూసుకుపోతుందని చంద్రబాబు అన్నారు. ‘ఆవు చేలో మేస్తే’ సామెత వలే జగన్మోహన్ రెడ్డి దోపిడీకి తగ్గట్టే ఎమ్మెల్యేల అవినీతి ఉందని ఆయన ధ్వజమెత్తారు. కొత్తగా లే అవుట్లు వేయాలంటే ఎకరాకు రూ.10లక్షల చొప్పున వైసీపీ ఎమ్మెల్యేలు వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు.

రైతులు నష్టపోతే కనీసం వారివైపు చూడని మంత్రి(కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి).. జిల్లాలో ఉన్నాడని చంద్రబాబు ఆరోపించారు. తనపై అనవసరంగా నోరుపారేసుకునే ముందు రైతులకు మంత్రిగా ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. కాగా.. కోవూరు స‌భ‌కు కూడా ప్ర‌జ‌లు భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. అయితే.. పోలీసులు మాత్రం య‌ధావిధిగానే త‌మ‌ డ్యూటీ చేశారు.