వ‌డ్డీతో స‌హా న్యాయం చేస్తా: చంద్ర‌బాబు

ఏపీ సీఎం జ‌గ‌న్ పై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న‌ను సైకోగా అభివ‌ర్ణించారు. బీసీల‌ పై క‌ప‌ట ప్రేమ కురిపిస్తున్నార‌ని అన్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో త‌మ హ‌క్కుల కోసం.. బీసీలు నోరు విప్ప‌లేని ప‌రిస్థితిని క‌ల్పించింది.. జ‌గ‌న్ కాదా? అని ప్ర‌శ్నించారు. బీసీలు మాట్లాడితే.. సైకో ముఖ్యంమంత్రి వారిని జైలులో పెట్టే పరిస్థితిని తీసుకువ‌చ్చారు.. అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. 26మంది బీసీలను పొట్టనపెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. తాను ముఖ్య‌మంత్రి కాగానే.. బీసీల అభివృద్ధికి సంబంధించిన ఫైల్‌పైనే తొలి సంత‌కం చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

కుర్చీ, బెంచీ లేని.. కనీసం పేపర్ కూడా లేని కార్పొరేషన్లు పెట్టి పనికిరాని పదవులు ఇచ్చారని, బీసీలు, బీసీల వృత్తులను అగౌరపరుస్తున్నారని మండిపడ్డారు. సబ్ ప్లాన్ తెచ్చి రూ.36 వేల కోట్లు ఇచ్చిన ఘనత టీడీపీదేనని చంద్ర‌బాబు తెలిపారు. టీడీపీ అధికారంలోకి రావడం ఖచ్చితమని, ఖచ్చితంగా వడ్డీతో సహా బీసీలకి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.

త‌మ హ‌యాంలో ఆధునిక పనిముట్ల కోసం బీసీ చేతి వృత్తుల వారికి తొంభై శాతం సబ్సీడీలు ఇచ్చామని చంద్ర‌బాబు తెలిపారు. జ‌గ‌న్ అధికారంలోకి రాగానే.., ఇసుక, సిమెంట్ రేట్లు విపరీతంగా పెంచి నిర్మాణ రంగం కుదేలయ్యేలా మండిప‌డ్డారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి రూ.1200 కోట్లు మాయం చేశారన్నారు. సీఎం జగన్‌ను బట్టలు ఉతికినట్టు ఉతికి ఉతికి ఆరేయాలన్నారు. రాష్ట్రంలో ఓ ఉన్మాదపాలన సాగుతుందని, బీసీలకు ఏం చేశారో.. జగన్ చర్చకి‌ రావాలని సవాల్ చేశారు. గీత కార్మికులుకు మద్యం దుకాణాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.

టీడీపీ రాకముందు బీసీలను ఓటర్లుగానే చూశారని, ఎన్టీఆర్ వెనకపడ్డ వర్గాలను ముందుకు నడిపించారని చంద్రబాబు అన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ బీసీలకు టీడీపీ ఉన్నతమైన పదవులు ఇచ్చిందని, రాజ్యాధికారంలో భాగస్వామ్యమైతే ప్రజలకు మేలు జరుగుతుందని, 50 శాతం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్ తెస్తే, ఇప్పుడున్న సీఎం జగన్ 24 శాతానికి తగ్గించారని విమర్శించారు. తాను సీఎం అయిన వెంటనే బీసీల అభివృద్ధి ఫైల్‌పైనే మొదటి సంతకం చేస్తానని స్పష్టం చేశారు.