నాణ్యమైన బ్రాండ్లు తక్కువ ధర..బాబు ప్రామిస్

మందు కొట్టకుండా సమాజంలో చాలా మంది ఉండలేరు. సాయంత్రమైతే తెలుగు రాష్ట్రాల్లో బ్రాందీ షాపులు కస్టమర్లతో కళకళలాడుతుంటాయి. రకరకాల బ్రాండ్ల మద్యం మార్కెట్లో కనిపిస్తుంది. కొన్ని కొత్త బ్రాండ్లు కూడా ఇప్పుడు మద్యం దుకాణాల్లో కనిపిస్తున్నాయి. మద్యం వ్యాపారంలో విపరీతమైన ఆదాయం ఉంటుంది.

అందుకే బ్రాందీ షాపుల కాంట్రాక్టులు చేజిక్కించుకునేందుకు సిండికేట్లుగా ఏర్పడి మరీ లాలూచీ పడిన రోజులు ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించినా.. మద్యం వ్యాపారులు అడ్డదారులు తొక్కకుండా ఉండలేరు. వారికి అదే వ్యాపారం. మద్యం వ్యాపారాలకు, అధికార పార్టీలకు లింకులు కూడా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…

సంపూర్ణ మద్యనిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ దాన్ని అమలు చేయకపోగా, ఊరూ పేరు లేని బ్రాండ్లను కూడా బ్రాందీ షాపుల్లో విక్రయిస్తున్నారు. షాపుల్లో నగదు చెల్లింపులు మాత్రమే అనుమతించడంతో అది బ్లాక్ మనీగా మారుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ 9 వేల కోట్లు అప్పు తెచ్చుకుంది. ఈ సంగతులను టీడీపీ అధినేత చంద్రబాబు కావలి రోడ్ షోలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. మందుబాబులకు సాయంత్రం అయితే తానే జ్ఞాపకం వస్తానని చంద్రబాబు అన్నారు. జగన్ కి మాత్రం తిట్లే తిట్లు అని అన్నారు. తాను అధికారంలోకి వస్తే మందు రేట్లు తగ్గుతాయని, మద్యం సేవించే వారి ఆరోగ్యం బాగుంటుందని, నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉంటాయని హామీ ఇచ్చారు. వైన్ షాపుల్లో ఆన్ లైన్ చెల్లింపులు, గూగుల్ పేలు ప్రవేశ పెట్టాలని ఆయన కోరారు. అసలు బూమ్ బూమ్ అనే వెరైటీ ఎక్కడైనా ఉందా అన్న చంద్రబాబు ప్రశ్నకు వైసీపీ నుంచి సమాధానం లేదు.

రూ. 25 వేల కోట్ల ఆదాయం

ఏపీలో మద్యం విక్రయాలతో వచ్చిన ఆదాయం రూ. 25 వేల కోట్ల రూపాయలు.ఇవీ తాజా లెక్కలు, ఒక్క ఏడాదిలో నాలుగు వేల కోట్ల ఆదాయం పెరిగింది. ప్రభుత్వ ఖజానాకు మద్యం ఆదాయం కూడా కీలక భాగమవుతోంది. మద్యం అమ్మనిదే ప్రభుత్వం మనుగడ సాగించలేని పరిస్థితి వచ్చింది. పైగా రాజకీయ పార్టీలకు సారా వ్యాపారులు నిధులిస్తుంటారు. సంపూర్ణ మద్య నిషేధం విధించాలని నేతలు నినాదాలిచ్చినా ప్రాక్టికల్ గా అది సాధ్యపడదు. పైగా మద్య నిషేధం విధిస్తే కాపు సారా పెరిగి… జనం చచ్చిపోవడం ఖాయం. ప్రొహిబిషన్ ఉన్న బిహార్లో ఇప్పుడు అదే జరుగుతోంది. తరచూ విష సారా తాగి పదుల సంఖ్యలో బిహారీలు ప్రాణాలు వదులుతున్నారు. అందుకే చంద్రబాబు మద్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం అందుబాటుకు తెస్తానని చెప్పేశారు. దానితో ఆయన అనధికారికంగా మద్యం మేనిఫెస్టో విడుదల చేసినట్లయ్యింది…