సీమ జనాలు ఇంకా జగన్‌ను నమ్ముతున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే రాజధాని విషయంలో మొదలైన డ్రామా గురించి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణ చేపడుతున్నామని.. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా YCP ముఖ్య నేతలందరూ చెబుతున్నారు. ఇందులో భాగంగా సీమ అభివృద్ధి కోసమని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయబోతున్నట్లు మూడేళ్లుగా చెబుతూ వస్తున్నారు.

అసలు కర్నూలులో హైకోర్టు పెడితే రాయలసీమ ఎలా అభివృద్ధి చెందుతుందో వివరించే నాథుడు ఎవరూ లేరు. ఆ సంగతి పక్కన పెడితే.. చెప్పిన మాట ప్రకారం Kurnoolలో హైకోర్టు ఏర్పాటు చేసే సంకేతాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఆ దిశగా జగన్ సర్కారు చిన్న ముందడుగు కూడా వేయలేదు. కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామనడం రాయలసీమ వాసులను మభ్యపెట్టడానికే అన్న అభిప్రాయం బలపడుతోంది. అమరావతిని దెబ్బ కొట్టే ఉద్దేశంతో ఆడుతున్న డ్రామాలాగే ఇది కనిపిస్తోంది.

కర్నూలుకు హైకోర్టును తరలించే ఉద్దేశం లేదని కోర్టుల్లో కూడా ప్రభుత్వ ప్రతినిధులు, లాయర్లు స్పష్టం చేసిన తర్వాత కూడా ఇటీవలే రాయలసీమ గర్జన పేరుతో ఓ కార్యక్రమం చేసి హడావుడి చేయడం, కర్నూలుకు హైకోర్టు వస్తుంటే అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాల మీద పడడం, ఇందుకు మద్దతుగా టాలీవుడ్ హీరోలు మాట్లాడాలని డిమాండ్ చేయడం వైకాపా నేతలకే చెల్లింది. కాగా ఇప్పటిదాకా చేసిందంతా ఒకెత్తయితే.. తాజాగా జగన్ సర్కారు తీసుకున్న ఓ నిర్ణయం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే విషయంలో ఎంత కమిట్మెంట్‌తో ఉందో తెలియజేస్తోంది.

కర్నూలుకు హైకోర్టును తరలించే దిశగా ఇంతకుముందు ఆ నగరంలో జ్యూడీషియల్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు ఇచ్చిన జీవోను జగన్ ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. కొత్తగా Amaravatiలోనే ఆ అకాడమీని ఏర్పాటు చేసేందుకు జీవో ఇవ్వడం గమనార్హం. దీన్ని బట్టి కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు అనేది ఇక కలే అని అర్థం చేసుకోవచ్చు. వాస్తవం ఇలా ఉంటే.. ఇంకా కూడా మూడు రాజధానులు పాట పాడుతూ.. కర్నూలుకు న్యాయ రాజధాని వస్తుందంటూ సీమ వాసుల్ని మభ్యపెట్టే పని మొత్తం యధావిధిగా కొనసాగుతోంది. జ్యుడీషియల్ అకాడమీ విషయం తెలిశాక కూడా జగన్ ప్రభుత్వాన్ని సీమవాసులు నమ్ముతారేమో చూడాలి.