తెలంగాణ‌ లోనే కాదు.. అమెరికాలోనూ రాజ‌కీయం చేస్తా!

తెలుగు వాళ్లు ఎక్క‌డుంటే.. అక్క‌డ రాజ‌కీయం చేస్తాన‌ని.. త‌న‌ను ఎవ‌రు ఆపుతారో చూస్తాన‌ని .. టీడీపీ అధినేత అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న కామెంట్లు చేశారు. అంతేకాదు.. తెలంగాణ‌లో రాజ‌కీయం త‌న‌కు కొత్త‌కాద‌ని.. త‌ను ఎక్క‌డున్నా.. అభిమానించే తెలుగు వారు ఉన్నార‌ని చెప్పారు. తెలంగాణ‌ను అభివృద్ధి చేసింది తానేన‌ని చెప్పారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో రాజ‌కీయాలు చేస్తుంటే.. కొంద‌రు వ‌ణికి పోతున్నారంటూ.. సీఎం జ‌గ‌న్‌ పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్తితిలో ఉన్న సీఎం జ‌గ‌న్‌. మూడు రాజ‌ధానులు ఎలా క‌డ‌తాడ‌ని ప్ర‌శ్నించారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి రోడ్ షోలో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన‌ చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపైనా, తాజాగా క‌డ‌ప స‌భ‌లో సీఎం జ‌గ‌న్ చేసిన‌.. కామెంట్ల పైనా బాబు విరుచుకు పడ్డారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో యువతను జగన్మోహన్ రెడ్డి మోసగించారని ఆరోపించారు. జీతాలు సైతం ఇవ్వలేని సీఎం 3 రాజధానులు కడతారా? అంటూ ఎద్దేవా చేశారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

వైసీపీ చర్యల వల్ల అమరావతిలో రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఫైనాన్షియల్‌, టూరిజం హబ్‌గా మారాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానికి భూములిచ్చిన రైతులు వెయ్యి రోజులుగా ఆందోళన చేస్తున్నారని.. వారి విషయంలో ప్రభుత్వం తీరు దారుణంగా ఉంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

వైసీపీ పాలనలో రైతులు ఆనందంగా లేరని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దిగజారిపోయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం సమయంలో ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కృషి చేసినట్లు చంద్రబాబు తెలిపారు. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది తమ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. నాయకత్వంలోనూ మహిళలు పోరాడాలని టీడీపీ అధినేత పిలుపునిచ్చారు.

తెలంగాణ‌లోనే కాదు.. అమెరికాలోనూ రాజ‌కీయం చేస్తా!

తెలుగువారు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. అది తెలంగాణ అయినా.. అమెరికా అయినా.. ఎక్కడైనా తెలుగువారి కోసం రాజ‌కీయంగా అండగా ఉంటానని చెప్పారు. తెలుగు వారి కోసమే తెలుగు దేశం పార్టీ పుట్టిందని ఉద్ఘాటించారు. దీనిపై కొంద‌రు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని.. అయినా.. త‌న‌ను ఎవ‌రూ ఆపలేర‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.