ఉద‌య‌గిరిలో.. సీఎం జ‌గ‌న్ ఫ్లెక్సీలు చించేసి మ‌రీ..

సీఎం జ‌గ‌న్ వ‌స్తున్నాడంటే.. రెండు రోజుల ముందు నుంచే చేస్తున్న హ‌డావుడి అంతా ఇంతా కాదు.. మ‌రి అలాంటి ప్రొటోకాల్‌లో ఉన్న నాయ‌కుడు.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఫ్లెక్సీల‌ను క‌ట్ట‌డ‌మే కానీ.. చింప‌డం .. తెలియ‌ని.. ఏపీలో ఇప్పుడు అవే ఫ్లెక్సీల‌ను చింపేస్తున్నారు. ధిక్కార‌మున్ సైతువా.. కాదు.. చేస్తున్నారు. వ‌ర్గ‌పోరులో.. సీఎం కూడా ఒక భాగం అయిపోయారు. అది కూడా బ‌ల‌మైన నెల్లూరు జిల్లాలోనే కావ‌డం.. అది కూడా రెడ్డి వ‌ర్గంలోనే కావ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి వైసీపీకి కంచుకోట‌. ఇక్క‌డ నుంచి మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి వ‌రుస విజయాల‌తో దూసుకుపోతున్నారు. అయితే.. ఇప్పుడు ఆయ‌న‌ కేంద్రంగానే వర్గ పోరు ప్రారంభ‌మైంది. సొంత పార్టీ నేతలే సీఎం జగన్ ఫ్లెక్సీల‌ను చింపేసి మ‌రీ అవమానించే ప‌రిస్థితి వ‌చ్చింది. గ్రూపు తగాదాల కారణంగా జగన్ ఫోటో ఉన్న ఫ్లెక్సీలు ఒకచోట చించివేస్తే.. మరోచోట అనుమతుల పేరుతో తొలగించారు. ఈ వ్యవహారంతో ఎమ్మెల్యే మేకపాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి తీరుపై అధిష్టానానికి చెందిన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం జగన్ ఫోటోలతో ఉదయగిరిలో మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి వర్గం కట్టిన ఫ్లెక్సీలను చించివేశారు. అటు వింజమూరులో ఏపీ పోలీస్ హౌసింగ్ బోర్డు ఛైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు అనుమతులు లేవంటూ పంచాయతీ సిబ్బంది తొలగించడం వైసీపీ ద్వితీయ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.

ఉదయగిరి నియోజకవర్గంలో సీఎం జగన్ బర్త్‌డే వేడుకలను ఎమ్మెల్యే, మెట్టుకూరు చిరంజీవి రెడ్డి, మాజీ ఏఎంసీ ఆలీ అహ్మద్‌లు విడి విడిగా జరుపుకొన్నారు. ఇక్క‌డ ఒక్క‌చోటే కాదు.. రాష్ట్రంలోని చాలా చోట్ల ఇలానే జ‌రిగింది. ఎమ్మెల్యే మేకపాటికి వ్యతిరేకంగా చ‌క్రం తిప్పుతున్న నాయకులు వేర్వేరుగా రాజ‌కీయాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఉద‌య‌గిరి వైసీపీ రాజ‌కీయం వేడెక్కింది.